జగన్ ఆర్దిక మూలాలపై గురి - ఢిల్లీ కేంద్రంగా, ఉక్కిరి బిక్కిరి..!!
ఏపీలో జగన్ లక్ష్యంగా రాజకీయం పదునెక్కింది. ఎన్నికల్లో ఓడిన తరువాత జగన్ అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఓడిపోయిన సమయంలోనే జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేయటం ద్వారా పై చేయి సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారు. షర్మిల వివాదం పీక్ కు చేరింది. అటు జగన్ కంపెనీల భూముల వ్యవహారం మరో సారి తెర మీదకు వచ్చింది. సొంత పార్టీ సీనియర్లు పార్టీ వీడుతున్నారు. అయితే, అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జగన్ ఏం చేయబోతున్నారు.
ఉక్కిరి బిక్కిరి
జగన్ రాజకీయంగా మరో సారి ముప్పేట దాడి ఫేస్ చేస్తున్నారు. 2012 లో కాంగ్రెస్ వీడి వైసీపీ ఏర్పాటు..కేసుల్లో జైలు శిక్ష సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులు తిరిగి జగన్ రాజకీయ జీవితంలో రిపీట్ అవుతున్నాయి. షర్మిల తాజాగా జగన్ షేర్లు అమ్మటం ద్వారా బెయిల్ రద్దుకు కుట్ర చేసారనేది వైసీపీ ఆరోపణ. దీన్ని షర్మిల ఖండించారు. అయితే, వైసీపీ అనుమానిస్తున్నట్లుగా జరిగితే జగన్ కేసుల్లో కీలక మలుపు చోటు చేసుకునే అవకాశం ఉంది. నాడు సీబీఐ కేసుల్లో జగన్ 16 నెలలు జైలులో ఉన్న సమయంలో వ్యాపారం, పార్టీ, కుటుంబ పరంగా జగన్ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు.

ఏం చేయబోతున్నారు
అయితే, అప్పటికీ .. ఇప్పటికీ ప్రధాన మార్పు ఉంది. నాడు జగన్ జైలులో ఉన్న సమయంలో తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అన్న తరపున పార్టీ కోసం రోడ్డు మీదకు వచ్చారు. ఇప్పుడు జగన్ కు ఆ ఇద్దరితోనూ వైరం పతాక స్థాయికి చేరింది. ఇదే సమయంలో పార్టీ సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. అటు టీడీపీ, జనసేన జగన్ పైన రాజకీయ దాడి తీవ్రతరం చేసాయి. జగన్ కంపెనీలకు చెందని భూముల పైన కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. అటు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన కేసులు కోర్టుల్లో ఉన్నాయి. ఇదే సమయంలో జమిలి ఎన్నికల అంశం తెర మీదకు వచ్చింది. పార్టీలో పరిణామాలు శ్రేణులకు అంతు చిక్కటం లేదు.
ఒంటరైన జగన్
జగన్ మాత్రం ఒంటరిగా ఫైట్ చేస్తున్నారు. గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఓటమి తరువాత జగన్ లో మార్పు వచ్చిందని భావిస్తున్న సమయంలోనే.. సమస్యలు ముప్పేట దాడి చేస్తున్నాయి. జగన్ ను ఆత్మరక్షణలో పడేయటమే చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. జగన్ కు ఢిల్లీలో ఏ స్థాయిలో మద్దతు ఉందనేది అంతు చిక్కని అంశం. పార్టీలో తొలి నుంచి ఉన్న నేతలు జగన్ కు అండగా నిలుస్తున్నారు. అయితే, పార్టీ తిరిగి బలోపేతం చేయాల్సిన సమయంలో జగన్ ఎదుర్కొంటున్న పరిస్థితులు పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. దీంతో..నాడు ఇదే రకమైన పరిస్థితిని ఒంటరిగానే ఎదుర్కొని.. పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చిన జగన్ .. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చేయబోతున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications