ట్విస్ట్, శివాజీ చెప్పాడు, చంద్రబాబు విన్లేదు.. నన్ను చంపేసి: హైకోర్టులో జగన్ పిటిషన్
అమరావతి/హైదరాబాద్: హత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై బుధవారం హైకోర్టుకు వెళ్లారు. తనపై కుట్ర జరిగిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యం ఉందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
అందుకే దాడి, ప్రాణహానీ, అవయవ దానంచేస్తా: ఆసుపత్రి వద్ద జగన్పై దాడి కేసు నిందితుడి ఆరుపులు
ఏపీ ప్రభుత్వం వైఫల్యం వల్లే తనపై దాడి జరిగిందని చెప్పారు. అలాగే కేసు సక్రమంగా జరపడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేసును ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నారు. ఇందులో ప్రతివాదిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరును చేర్చారు. మొత్తం 8 మందిని చేర్చారు. చంద్రబాబుతో పాటు డీజీపీ, విశాఖ ఏసీపీ, ఎయిర్ పోర్టు పీఎస్ ఎస్హెచ్ఓ తదితరులను పేర్కొన్నారు.
శ్రీనివాస్ దగ్గర స్వాధీనం చేసుకున్న లేఖలో మూడు చేతి రాతలు ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. నేరుగా తన మెడపై దాడి చేయబోయాడని, ప్రతిఘటించడంతో భుజానికి గాయమైందన్నారు. కేసు త్వరగా క్లోజ్ చేసేందుకు నార్త్ విశాఖ ఏసీపీని నియమించారని చెప్పారు. నాపై హత్యాయత్నం జరిగిందని స్వయంగా పోలీసులే రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని చెప్పారు.
కుట్ర కోణం విస్మరించారు
తనపై దాడి కేసును గురించి పేర్కొంటి, దర్యాఫ్తులో కుట్ర కోణాన్ని విస్మరించారని జగన్ పేర్కొన్నారు. కుట్ర కోణాన్ని సజావుగా దర్యాఫ్తు చేయాలని హైకోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది రేపు విచారణకు వచ్చే అవకాశముంది. తాను ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఏపీలో పాదయాత్ర చేస్తున్నానని, ప్రభుత్వ వైఫల్యాలను, తప్పిదాలను, పాలకుల అక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నానని జగన్ చెప్పారు.
Recommended Video
నాపై దాడి చేస్తారని గతంలో శివాజీ ప్రకటించాడు
చంద్రబాబు సర్కారు, టీడీపీ దుర్మార్గాలను ఎండగడుతున్నానని జగన్ చెప్పారు. ఆపరేషన్ గరుడ పేరుతో ఓ కొత్త నాటకాన్ని తెరపైకి టీడీపీ నేతలు తెచ్చారని అన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం పడగొట్టే ప్లాన్ అంటూ చెబుతున్నారని, టీడీపీ సానుభూతిపరుడైన నటుడు శివాజీయే ఆపరేషన్ గరుడ సూత్రధారి అన్నారు. పాదయాత్రలో నాపై ఓ దాడి చేస్తారని శివాజీ గతంలో ప్రకటించారని చెప్పారు.
నన్ను చంపి ఆపరేషన్ గరుడ అని చెప్పే ప్రయత్నం
టీడీపీ ప్రభుత్వం పతనానికి అది దారి తీస్తుందని శివాజీ అప్పుడు చెప్పారని జగన్ పేర్కొన్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఇదొక భారీ కుట్ర అని అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతను హత్య చేసి ఆఫరేషన్ గరుడలో భాగమని చెప్పే ప్రయత్నమని ఆయన ఆరోపించారు.
తృటిలో తప్పించుకున్నా.. ఆ రోజు ఏం జరిగిందంటే?
అక్టోబర్ 25న ఇద్దరు భద్రతా సిబ్బందితో తాను విశాఖపట్నం విమానాశ్రయానికి వచ్చానని జగన్ పేర్కొన్నారు. లాంజ్లో కూర్చొని ఉండగా రెస్టారెంటులో పని చేసే వ్యక్తి తన వద్దకు వచ్చాడని, సెల్ఫీ తీసుకుంటానని తన వద్దకు వచ్చి దాడి చేయబోయాడని, పదునైన కత్తితో నాపై దాడి చేయగా నేను తృటిలో తప్పించుకున్నానని పేర్కొన్నారు. తాను కిందకు వంగడంతో గొంతుకు తగలాల్సిన కత్తి భుజంలో గుచ్చుకుందని చెప్పారు.
డీజీపీ, ముఖ్యమంత్రుల ప్రెస్ మీట్
దాడి చేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకొని వెళ్లి పోలీసులకు అప్పగించారని, ప్రాథమిక చికిత్స అనంతరం తాను హైదరాబాదుకు వచ్చానని జగన్ పేర్కొన్నారు. సిటీ న్యూరో ఆసుపత్రిలో తనకు చికిత్స చేసి 9 కుట్లు వేశారని, తనపై దాడి జరిగిన గంటలోనే ఏపీ డీజీపీ ప్రెస్ మీట్ పెట్టారని, ప్రచారం కోసం దాడి జరిగినట్లుగా కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారని, ఆ తర్వాత సీఎం ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగమని చెప్పారని తెలిపారు.