చంద్రబాబు జమానా అవినీతి ఖజానే: వైయస్ జగన్
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు సహకరిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని, రాష్ట్ర సమైక్యంగా ఉంటేనే సీమాంధ్ర ప్రజలకు, రైతులకు నీళ్లు వస్తాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. ఆయన సోమవారం చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో బహిరంగ సభ నిర్వహించారు.
ప్రజలందరూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటుంటే.. చంద్రబాబుకు మాత్రం సమైక్యమన్న మాటే రావడం లేదని ఆరోపించారు. చంద్రబాబుదంతా కుమ్మక్కు రాజకీయమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఎవరు కుమ్మక్కయ్యారో తెలుస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెత్తుకుంటే ఎందుకు తనను జైలుకు పంపిస్తారని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడిన రెండు నెలల తర్వాత టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై తనను జైలు పాలు చేశాయని జగన్ ఆరోపించారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిపైనా కేసులు పెట్టారని తెలిపారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టిడిపి, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. చంద్రబాబు హైదరాబాద్ లోని అమీర్ పేటలోని 400 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని స్వాహా చేశారని అన్నారు. పార్లమెంటులో ఎఫ్డిఐపై ఓటింగ్ జరుగుతున్న సమయంలో తన పార్టీకి చెందిన సభ్యులను చంద్రబాబు గైర్హాజరరు చేయించారని ఆరోపించారు.
చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇవ్వడం వల్లే విభజన జరుగుతోందని జగన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని ఆరోపించారు. పలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ చంద్రబాబు భారీగా ఆస్తులను కూడ గట్టుకున్నారని ఆరోపించారు. పక్కరాష్ట్రాల్లోనూ వ్యాపారాలున్నాయని తెలిపారు. ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని జగన్ ప్రశ్నించారు.
శ్రీమంతుల కోసం భవంతులు కట్టి ఇచ్చేందుకు హైదరాబాద్లో 530 ఎకరాలు తన హయాంలో చంద్రబాబు కేటాయించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు జమానా అంతే అవినీతి ఖజానా కాదా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ఏదో పేరుతో సభలు పెట్టి సమైక్య ఉద్యమాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్రమంత్రి చిరంజీవి, చంద్రబాబులను సీమాంధ్ర ప్రజలు క్షమించరని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో 30 సీట్లు తామే గెలుచుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని అన్నారు.