ఎవర్నీ వదిలిపెట్టలేదు: ఇంటికొచ్చిన బాబుని నిలదీయండంటూ జగన్ పిలుపు
అమరావతి: అబద్ధపు హామీలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి రాజకీయ వ్యవస్థను దిగజార్చారని వైసీపీ అధినేత వైయస్ జగన్ విమర్శించారు. విశాఖపట్నం జిల్లా మునగపాకలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం కొనసాగిస్తామన్నారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన అబద్దాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే గడప గపడకు వైసీపీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎవర్నీ వదలిపెట్టకుండా హామీలు ఇచ్చాడని, గెలిచాక ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.
అవసరం వచ్చినప్పడు హత్తుకుని, అవసరం తీరాక అవతలికి పొమ్మనే స్వభావం చంద్రబాబుదని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ప్రజల అవసరం తీరిపోయిందని చంద్రబాబు భావిస్తున్నాడని మండిపడ్డారు. ఇచ్చిన హామీల అమలయ్యేంత వరకు ఇలాంటి వ్యక్తిని నిలదీయాలని ప్రజలను కోరారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నాడా? అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. నిరుద్యోగులైన యువకులకు నిరుద్యోగభృతి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. గడపకు గడపకు వైసీపీ కార్యక్రమంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఇదే విషయాన్ని అడిగామని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు మార్కులు వేయాలని ప్రజలను కోరామని అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫలానా పనులు చేస్తానని చెప్పిన వ్యక్తి, అధికారంలోకి వచ్చాక ప్రజలకు మేలు చేయకుంటే ఏం చేయాలి? అని నిలదీశారు. సీఎం అయిన తర్వాత ఏ చేసినా నడుస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారని అన్నారు.
మీ గ్రామాల్లో పర్యటనకు వచ్చినప్పుడు ఎన్నికలపుడు ఏం చెప్పావు, ఇప్పుడు ఏం చేస్తున్నావని చంద్రబాబును నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పుడే వ్వవస్థలో మార్పు వస్తుందని అన్నారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో చంద్రబాబు పాలనలో జరుగుతున్న మోసాలను నిలదీయాలని పార్టీ నేతలకు చెప్పానని అన్నారు.












Click it and Unblock the Notifications