జగన్ వాట్ నెక్ట్స్ ? సుప్రీంలో అమరావతి విచారణ ఆలస్యం-పాదయాత్రకు హైకోర్టు క్లియరెన్స్ తో !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని స్ధానంలో తెరపైకి తెస్తున్న మూడు రాజధానుల్ని అమల్లోకి తీసుకురావడంలో మాత్రం విఫలమవుతోంది. ముఖ్యంగా అమరావతినే రాజధానిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసినా ఈ పిటిషన్ విచారణకు సీజేఐ మొగ్గు చూపకపోవడంతో మరో బెంచ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అదే సమయంలో హైకోర్టు కూడా అమరావతి పాదయాత్ర రద్దుకు ఆసక్తిచూపకపోవడంతో త్వరలో రైతులు పాదయాత్రను పునఃప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కొత్త వ్యూహాలు ఎంచుకోక తప్పట్లేదు.
సుప్రీంలో అమరావతి విచారణ ఆలస్యం
అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీతో పాటు రైతులతో పాటు ఇతర వర్గాలు దాఖలు చేసిన 9 కేవియట్ పిటిషన్లపై విచారణ సుప్రీంకోర్టులో ప్రారంభమైనట్లే ప్రారంభమై ఆగిపోయింది. దీనికి కారణం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యూయూ లలిత్ గతంలో 2014లో విభజన చట్టంపై తన అభిప్రాయం చెప్పడమే. ఈ నేపథ్యంలో ఆయన విచారణ నుంచి తప్పుకుని మరో బెంచ్ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు కొత్త బెంచ్ ఏర్పాటు అయితే తప్ప విచారణ ముందుకు సాగేలా లేదు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఎస్ఎల్పీని సత్వర విచారణ జరపాలని కోరినా సీజేఐ తప్పుకోవడంతో ఇప్పుడు ఆలస్యం తప్పడం లేదు.
అమరావతి పాదయాత్రకు హైకోర్టు సై
అదే సమయంలో అమరావతి రైతులు సాగిస్తున్న పాదయాత్రకు గతంలో ఇచ్చిన అనుమతుల్ని కొనసాగిస్తున్నట్లు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మారింది. ఈ పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలని డీజీపీ కోరినా హైకోర్టు అంగీకరించలేదు. దీంతో రైతులు తిరిగి పాదయాత్ర ప్రారంభించేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పోలీసుల హంగామాతో పాదయాత్ర నిలిపేసిన రైతులు తిరిగి రామచంద్రపురం నుంచే పాదయాత్ర మొదలుపెట్టే అవకాశాలున్నాయి. ఇది మొదలైతే మళ్లీ రాజకీయ పోరు మొదలైనట్లేనని భావిస్తున్నారు.
మరో రాజకీయ పోరు
అటు సుప్రీంకోర్టులో అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీపై విచారణ జరగాల్సి ఉంది. అదే సమయంలో అమరావతి పాదయాత్ర ప్రారంభమవుతోంది. దీంతో సహజంగానే అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరు మళ్లీ మొదలుకాబోతోంది. అలాగే అమరావతి పాదయాత్ర మొదలైన తర్వాత మళ్లీ వైసీపీ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయి. దీంతో మళ్లీ అవే ఉద్రిక్తతలు తప్పేలా లేవు. ఇప్పటికే పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తోందన్న విషయం జనంలోకి వెళ్లడంతో సానుభూతి పెరుగుతోంది. అదే సమయంలో రాజధానులకు అనుకూలంగా ఉన్న వైసీపీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఇరువర్గాల మధ్య మరో పోరుకు రంగం సిద్ధమైనట్లే.
కొత్త వ్యూహాల వేటలో జగన్ ?
ఓవైపు అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ఆలస్యం అవుతుండటం, మరోవైపు అమరావతి పాదయాత్ర మొదలుకానుండటంతో వైఎస్ జగన్ మరోసారి వ్యూహాలకు పదునుపెడుతున్నారు. సుప్రీంకోర్టులో కొత్త బెంచ్ ఏర్పాటు చేసి సత్వర విచారణ జరపాలని ప్రభుత్వం మరోసారి కోరే అవకాశాలున్నాయి. అలాగే అమరావతి పాదయాత్రను మరింత టైట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అదే సమయంలో వికేంద్రీకరణ సభలు, ర్యాలీలతో హోరు పెరగబోతోంది. అలాగే అమరావతిపై కోర్టుల్లో విచారణ కొనసాగుతుండగానే తాను మాత్రం విశాఖకు మకాం మారిస్తే ఎలా ఉంటుందనే దానిపై ముఖ్యులతో జగన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ జాతీయ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అనే వ్యాఖ్యలు కూడా చేసిన జగన్.. ఇప్పుడు అదే కోణంలో వ్యూహాలకు పదునుపెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలోనూ పలుమార్లు ఇదే ఆలోచన చేసినా ముందుకు సాగేందుకు మాత్రం జగన్ ఇష్టపడలేదు. దీంతో ఈసారి ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.