రేషన్ కార్డు దారులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్..
ఏపీలో రేషన్ కార్డు దారులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకూ రేషన్ పంపిణీలో ఎదురవుతున్న ఒక్కో ఇబ్బందీ తొలగించుకుంటూ వస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో నెలవారీ రావాల్సిన రేషన్ రావడం లేదని ఆవేదన చెందుతున్న లబ్దిదారులకు భారీ ఊరట దక్కబోతోంది. ఇందుకు సంబంధించి పౌరసరఫరాలశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఏపీలో రేషన్ పంపిణీ కోసం లబ్దిదారుల నుంచి వేలి ముద్రలు సేకరిస్తున్నారు. అసలే కూలీనాలీ చేసుకునే పేదలు, వేళ్లు కమిలిపోయి బయోమెట్రిక్ ద్వారా మెషీన్ లో వేలిముద్రలు పడని పరిస్దితి. దీంతో నెలవారీ రేషన్ ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి నుంచి పదే పదే రేషన్ అందడం లేదనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పద్ధతిని ప్రవేశపెడుతోంది.

ఇకపై ఐరిస్ ఆధారిత ధ్రువీకరణతో రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వేలిముద్రలు పడని లబ్ధిదారులకు ఊరట కలగబోతోంది. ఏపీలో ఐరిస్ ఆధారిత ఆధార్ ధ్రువీకరణ ద్వారా నిత్యావసరా లను పంపిణీ చేయను న్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ ప్రకటించారు. ఇప్పటివరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ-పోస్ యంత్రంలో లబ్ధిదారుల వేలిముద్రలను ధ్రువీకరించి రేషన్ అందిస్తున్నామని, రోజువారి కూలీలు, వృద్ధులు, పలు వ్యాధిగ్రస్తులకు వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు.
దీంతో ప్రభుత్వం ఇకపై వేలిముద్రలు పడని వారికి ఐరిస్ ఆధారిత ఆధార్ ధ్రువీకరణ ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. లబ్ధిదారుల సౌకర్యార్థం 9,260 ఎండీయూ వాహనాల్లో కొత్తగా ఐరిస్ (కంటి) పరికరాలను పెడుతు న్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెలలో(జూన్) వేలిముద్రలతో పాటు ఐరిస్ ఆధారిత ధ్రువీకరణను ప్రామాణికంగా తీసుకుని నిత్యావసరాలు అందజేయనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications