ఆరోగ్యశ్రీ రోగులకు జగన్ గుడ్ న్యూస్-మరిన్ని చికిత్సలు-అగస్టు 1 నుంచే-త్వరలో ఫ్యామిలీ డాక్టర్
అమరావతి: ఏపీలో ఆరోగ్యశ్రీ చికిత్సలపై సీఎం జగన్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఆగస్టు 1 నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అందుబాటులోకి తీసుకురావాలని కూడా సూచించారు. విలేజ్ క్లినిక్స్కు, పీహెచ్సీలకు డిజిటల్ వీడియో అనుసంధానత ఉండాలన్నారు.

జగన్ వైద్యారోగ్య సమీక్ష
వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీపై సీఎం సమీక్ష చేశారు. ఇందులో జగన్ అధికారులకు పలు సూచనలుచేశారు. ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీలో అందుతున్న చికిత్సలను కొనసాగిస్తూ కొత్త వాటిపై దృష్టిపెట్టాలన్నారు. ఏపీలో ప్రజారోగ్యం మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జగన్ పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన చర్యలపైనా ఆదేశాలు ఇచ్చారు.

ఆరోగ్యశ్రీలో అదనపు చికిత్సలు
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. పెంచనున్న చికిత్సల జాబితాను త్వరలోనే ఖరారుచేస్తామన్ని అధికారులు ఆయనకు తెలిపారు. ఆగస్టు 1 నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ ద్వారా 2446 చికిత్సలకు ప్రభుత్వంఉచితంగా వైద్యం అందిస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 1059 చికిత్సలో అమలయ్యేవి.

ఆరోగ్యశ్రీలో మార్పులివే
అలాగే ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు వర్చువల్ బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద డబ్బు నేరుగా రోగి వర్చువల్ బ్యాంకు ఖాతాలోకి వెళ్లాలన్నారు. అక్కడ నుంచి ఆస్పత్రికి చెల్లింపులు జరగాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రిలో చేరిన రోగి నుంచి ముందుగా కన్సెంట్ ఫాం తీసుకుంటారు. అలాగే చికిత్స పూరై్తన తర్వాత ధృవీకరణ పత్రం ఇస్తారు. ధృవీకరణ పత్రంలో వైద్యంకోసం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం నుంచి అందిన సహాయం వివరాలు ఉంటాయి. అలాగే రోగి కోలుకునేంతవరకూ ఆరోగ్య ఆసరా ద్వారా అందుతున్న సహాయం వివరాలు పొందుపరుస్తారు.
రోగి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేశారా? పూర్తి ఉచితంగా వైద్యం అందిందా? అన్న విషయాలను కూడా ధృవీకరించేలా పత్రం ఉంటుంది. ఎవరైనా లంచం లేదా అదనపు రుసుము వసూలు చేసిన నేపథ్యంలో ధృవీకరణ పత్రంలో ఫిర్యాదులకోసం ఏసీబీకి కేటాయించిన టోల్ఫ్రీ నంబర్ 14400 లేదా 104 ఉంచాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.

జగన్ కీలక నిర్ణయాలు
ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. దశలవారీగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విలేజ్ క్లినిక్స్కు, పీహెచ్సీలకు డిజిటల్ వీడియో అనుసంధానత ఉండాలని సీఎం సూచించారు. రోగి ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన వారం తర్వాత ఆరోగ్య సిబ్బంది సంబంధిత గ్రామానికి వెళ్లి ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిమీద విచారణ చేయాలని ఆదేశం ఇచ్చారు. మరింత సహాయం అవసరమైన పక్షంలో సమన్వయం చేసుకుని ఆ సహాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు.
రోగికి అందిన సేవలు, అదనంగా కావాల్సిన మందులు, తదితర అంశాలపైన కూడా ఫోన్కాల్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. 108, 104 లాంటి సర్వీసుల్లో కూడా లంచాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఈ వాహనాలపైన ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉంచాలని ఆదేశమిచ్చారు.












Click it and Unblock the Notifications