వైద్యారోగ్యంపై జగన్ కీలక సమీక్ష-అక్టోబర్ 15 నుంచి ఆరోగ్యశ్రీ చికిత్స పెంపు-మరిన్ని 104 వాహనాలు
అమరావతి : వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. వైయస్సార్ ఆరోగ్య శ్రీ జాబితాలోకి కొత్త చికిత్సలు చేరిక దాదాపు ఖరారైంది. కొన్ని సంప్రదింపులు మిగిలి ఉన్న దృష్ట్యా కార్యక్రమం ప్రారంభానికి సమయం కావాలని అధికారులు సీఎం జగన్ ను కోరారు. అక్టోబరు 5కు బదులు, అక్టోబరు 15 న ఆరోగ్య శ్రీ జాబితాలోకి మరిన్ని ప్రొసీజర్ల చేరిక కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్ పైలెట్ ప్రాజెక్టు కూడా ప్రారంభం కానుంది.

జగన్ వైద్యారోగ్య సమీక్ష
ఏపీలో వైద్య,ఆరోగ్య రంగాల్లో తాజా పరిస్ధితిపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ పలు ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య శ్రీతో పాటు పలు పథకాల పురోగతి, కొత్త పథకాలపై అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న జగన్..ఈ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం వైయస్సార్ ఆరోగ్యశ్రీలో 2,446 చికిత్సలు అమలవుతుండగా.. కొత్త వాటి చేరికతో 3,254కి ఇవి చేరనున్నాయి. వీటిని ఎప్పటికల్లా అమల్లోకి తీసురావాలన్ని దానిపై ఇవాళ నిర్ణయం తీసుకున్నారు.

ప్రజారోగ్యంపై మా చిత్తశుద్ధి ఇదే..
ఆరోగ్య శ్రీ, అనుబంధ సేవల కింద చేస్తున్న ఖర్చు గత ప్రభుత్వంతో పోలిస్తే ఏడాదికి దాదాపు మూడు రెట్లు పెరిగిందని సీఎం జగన్ తెలిపారు. పెరిగిన ప్రొసీజర్లతో ఏడాదికి ఆరోగ్య శ్రీకి సుమారుగా రూ.2,500 కోట్లు, ఆరోగ్య ఆసరాకోసం సుమారు రూ.300 కోట్లు, 108, 104లకోసం సుమారు మరో రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. మొత్తంగా దాదాపు రూ.3200 కోట్లు వరకూ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104లకోసం ఖర్చు చేస్తున్నామన్నారు.
ప్రజల ఆరోగ్యం మీద ఈ ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు.

104, 108 వాహనాల లోపాలపై
రాష్ట్రంలో 104, 108 వాహనాల నిర్వహణలో లోపాలపై సీఎం జగన్ ఇవాళ సమీక్షించారు. త్వరలో మరో 432 కొత్త 104 వాహనాలు అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే 676 వాహనాలు సేవలందిస్తుండగా.. కొత్త వాటితో కలిపి వారి సంఖ్య 1108కి చేరనుంది. అలాగే ఇప్పటికే సేవలందిస్తున్న 108 వాహనాలు 748 కాగా...వీటి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. విలేజ్ క్లినిక్స్లో 12 రకాల వ్యాధి నిర్ధారణ కిట్లు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నామని అధికారులు తెలిపారు. కోవిడ్ కిట్ కూడా అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు.

జగన్ కీలక ఆదేశాలివే..
ఆస్పత్రుల్లో ఉండాల్సిన స్థాయిలో సిబ్బంది ఉండాలని సీఎం జగన్ ఇవాళ అధికారుల్ని ఆదేశించారు. దీనికోసం ప్రతినెలా కూడా ఆస్పత్రుల వారీగా ఆడిట్ చేయాలన్నారు. ఈ ఆడిట్ నివేదికలు ప్రతి నెలాకూడా అధికారులకు చేరాలన్నారు. క్రమం తప్పకుండా దీన్ని పర్యవేక్షించాలన్నారు. ఎక్కడ ఖాళీ వచ్చినా వెంటనే మరొకర్ని నియమించే ప్రక్రియ నిరంతరం కొనసాగాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా చూసేందుకు, నిరంతరం ఈ ప్రక్రియను మానిటర్ చేసి తగిన చర్యలు తీసుకునేందుకు మెడికల్ రిక్రూట్మెంట్బోర్డు ఏర్పాటు ఆలోచన కూడా చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్ డైట్ ఛార్జీలను పెంచాలని సీఎం ఆదేశించారు.
ఆరోగ్య శ్రీ పేషెంట్ల తరహాలోనే రోజుకు రూ.100లకు పెంచాలన్నారు. నిశితంగా పరిశీలన చేసి మంచి మెనూ ఇవ్వాలన్నారు. జూనియర్డాక్టర్ల స్టై ఫండ్ పెంపుపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త మెడికల్కాలేజీల నిర్మాణంపైనా సీఎం సమీక్ష చేశారు. మెడికల్ కాలేజీల నిర్మాణపనులపై మరింత ధ్యాస పెట్టాలన్నారు. అర్బన్హెల్త్ క్లినిక్స్ల నిర్మాణం నవంబర్ నెలాఖరుకల్లా పూర్తవుతాయని అధికారులు సీఎంకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ అవార్డుల్లో 6 అవార్డులు ఏపీకి వచ్చాయని సీఎంకు అధికారులు వివరించారు. మొత్తం 10 అవార్డుల్లో 6 ఏపీకే వచ్చాయన్నారు.












Click it and Unblock the Notifications