బాబూ! మీ ఎంపీలతో రాజీనామా చేయించు, కేసీఆర్లా కాదు: జగన్, ‘కోడెల టాక్స్-టీఎస్టీ’
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం సత్తెనపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరుదాటాక తెప్పతగలేశారని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.
కేసీఆర్ అంటే భయం ఎందుకు బాబూ..
‘నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల ప్రజలకు చంద్రబాబు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారని? రైతులు అడుగుతున్నారు. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఉన్నదేంటి? చంద్రబాబుకు లేనిదేంటని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్కు ఉన్నది రోషం. మన చంద్రానికి రోషం లేదు. ‘చంద్రబాబు వద్ద అవినీతి సొమ్ము మాత్రం విచ్చలవిడిగా ఉంది. ఆ డబ్బుతో ప్రతిపక్షం ఎమ్మెల్యే, ఎంపీలను కొంటున్నారు. లంచం ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిన చంద్రబాబు ఏపీకి నీటి విడుదలపై కేసీఆర్తో మాట్లాడలేక భయపడుతున్నారు. ఏమైనా మాట్లాడితే టేపులను బయటకు తీసి కేసీఆర్ జైల్లో వేయిస్తాడని చంద్రబాబు వణికిపోతున్నాడు. నాలుగేళ్లుగా రైతులు కష్టపడాల్సిన పరిస్థితి చంద్రబాబు వల్లే వచ్చింది'
కోడెల టాక్స్.. టీఎస్టీ..
‘ఒకవైపు జీఎస్టీ మోతతో షాపుల వాళ్లు తలలు పట్టుకుంటుంటే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో టీఎస్టీ(తెలుగుదేశం సర్వీస్ ట్యాక్స్) కూడా విధిస్తున్నారు. జన్మభూమి కార్యక్రమం మొదలు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థతో ముడిపడిన ఏ పని జరగాలన్నా ఈ టీఎస్టీని చెల్లించాల్సిందే. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అయితే ప్రత్యేకంగా మరో ట్యాక్స్ వేస్తున్నారు. అదే కోడెల సర్వీస్ ట్యాక్స్(కేఎస్టీ). తోపుడు బండ్లు మొదలు అపార్ట్మెంట్ల వరకూ కేఎస్టీని వసూలు చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో సత్తెనపల్లిలో అవినీతి జరుగుతోంది' అని జగన్ ఆరోపించారు.
బాబంటే.. నమ్మించు.. వంచించు.. అంతేకాదు
‘ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని టీడీపీ నిలబెట్టుకోలేదు. ఏ కులాన్ని, వర్గాన్ని వదలకుండా చంద్రబాబు మోసగించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనంతా మోసం.. మోసం.. అబద్దాలు.. ఆయన ఘనకార్యాలను ప్రజలు, వ్యవస్థ ప్రశ్నించడం మొదలుపెట్టేసరికి వణకు రావడం ప్రారంభమైంది. దీంతో ఎన్నికల రాజకీయ సూత్రాన్ని బయటకు తీశాడు చంద్రబాబు. ప్రజలను నమ్మించు.. వంచించు అనేదే చంద్రబాబు రాజకీయ సూత్రం. వారికి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆ నెపాన్ని వేరే వారిపై నెట్టేయ్. అక్కడితో ఆగదా సూత్రం.. ఇందుకోసం తన అనుకూల మీడియాను వాడుకో అంటాడు బాబు.. ఆయన్ను బలహీనపరచడం అంటే.. రాష్ట్రాన్ని, ప్రజలను బలహీనపరచడం అట. నాకు ఆశ్చర్యం వేస్తుంది. చంద్రబాబు నైజానికి సంబంధించి ఒక సామెత ఉంది. ఒక దొంగ ఉన్నాడు. తప్పుడు పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దొరికిన ఆ దొంగను, ప్రజలు, వ్యవస్థ ప్రశ్నించాయి. నన్ను అరెస్టు చేస్తే మన ఊరికే చెడ్డపేరు అని అన్నాడట ఆ దొంగ. నన్ను బలహీనపరిస్తే ఊరే బలహీనపడుతుందని అన్నాడట ఆ దొంగ. ఇదే కార్యక్రమాన్ని బాబు చేస్తున్నారు' అని జగన్ ఎద్దేవా చేశారు.
గాడిదలు కాస్తున్నావా? బాబూ..
‘ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు అంటున్న మాటలు ఆశ్చర్య పరుస్తున్నాయి. ప్రత్యేక హోదా పోరాటానికి ఈయన దిశానిర్దేశం చేస్తాడట. అందుకు అఖిలపక్షాన్ని పిలుస్తాడట. దొంగోడే చివరికి దొంగా.. దొంగా.. అని అరవడం మొదలుపెట్టినట్లుంది. ఇదే పెద్ద మనిషిని మీ ద్వారా అడుగుతున్నా.. మార్చి 2, 2014న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అప్పటి కేబినేట్ ఆమోదించింది. దాన్ని ప్రణాళిక సంఘానికి పంపింది. జూన్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు నెలల పాటు ఆదేశాలు అలానే బల్లపై ఉన్నాయి. ఆ కాలంలో ఆదేశాలను అమలు చేయమని కోరకుండా గాడిదలు కాస్తున్నావా?' అని జగన్ మండిపడ్డారు.
పోరాటాలు చేస్తుంటే..
2016 సెప్టెంబర్ 8న అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదాపై ఇవ్వమని చెబితే కృతజ్ఞతలు చెప్పాడు చంద్రబాబు. మరుసటి రోజు అసెంబ్లీలో జైట్లీ ప్రకటనను స్వాగతిస్తూ.. కోడులు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అంటాడు. ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో ఏం సాధించాయని ఎదురు ప్రశ్నించాడు?. జైట్లీ ప్రకటన అనంతరం టీడీపీ మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరించుకుని ఉంటే ఇప్పటికే ప్రత్యేక హోదా వచ్చేది. ప్రత్యేక హోదాపై వైసీపీ పోరాటాలు చేస్తే ఈ పెద్ద మనిషి అడ్డుకోలేదా?. మోడీ వస్తున్నారని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా నేను చేస్తున్న నిరాహార దీక్షను భగ్నం చేయించారు' అని జగన్ ధ్వజమెత్తారు.
తాము ముందుకొచ్చిన తర్వాతే..
అంతేగాక, ‘హోదా కోసం బంద్లు చేస్తే.. బలవంతంగా బస్సులు నడిపించారు. యువభేరీలు ఏర్పాటు చేస్తే పిల్లలపై పీడీ యాక్టు పెడతానని బెదిరించారు? ప్రత్యక హోదాపై టీడీపీ నాలుగేళ్లుగా చేసింది ఇది కాదా?. మార్చి 16న వైసీపీ అవిశ్వాసం పెట్టకపోతే నువ్వు పెట్టి ఉండే వాడివా బాబు?. అవిశ్వాసానికి మద్దుతు ఇవ్వాలని ప్రతి పార్టీని వైసీపీ ఎంపీలు కలిశారు. మద్దుతు కూడగట్టారు. ఇది చూసిన బాబు 15న తాను చెప్పిన మాట మార్చుకుని ప్రత్యేకంగా తాము కూడా అవిశ్వాసం పెడతామన్నారు' అని జగన్ అన్నారు.
పవన్ గురించా! టైమ్వేస్ట్: తేల్చేసిన జలీల్ ఖాన్, ‘విజయసాయి బ్రోకర్లా.. 40కోట్లు రిటర్న్ అలానే'
ఎంపీలతో రాజీనామా చేయించు లేదంటే..
‘మేం అవిశ్వాసం పెట్టడం వల్లే ఇతర పార్టీలు మద్దుతు ఇచ్చాయని సిగ్గులేకుండా అబద్దాలు బాబు చెప్పారు. ఇటువంటి చిత్తశుద్ది లేని పెద్దమనిషి ఈ చంద్రబాబు. ఇవాళ అఖిలపక్షాన్ని మేం ఎలా నమ్మాలి?. అయ్యా నిన్ను మేం నమ్మం. నీకు చిత్తశుద్ది లేదు. వెన్నుపోటు పొడవడం నీ రక్తం లోనే ఉంది. మేం ఇప్పటికే కార్యాచరణ ప్రకటించాం. ప్రజలలో ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రత్యేక హోదాపై నువ్వు తలొగ్గావు. ఇవాళ రాష్ట్రం గురించి దేశం మాట్లాడుకుంటోంది. చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే పార్లమెంటు సమావేశాల చివరి రోజున మా పార్టీ ఎంపీలతోపాటు మీ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించు. ఒకేసారి 25మంది ఎంపీలు రాజీనామా చేస్తే దేశం మొత్తం చర్చ జరుగుతుందని, అప్పుడు కేంద్రం దిగివచ్చి హోదా ఇస్తుంది' అని జగన్ స్పష్టం చేశారు.