30ఏళ్లు నేనే సీఎం: జగన్, అర్ధరాత్రిదాకా ఆసుపత్రిలో..
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు మండిపడ్డారు. రుణమాఫీ అనే అబద్దంతోనే బాబు అధికారంలోకి వచ్చారన్నారు. శుక్రవారం ఆళ్లగడ్డ, నంద్యాల వైసీపీ శ్రేణులనుద్దేశించి ఆయన మాట్లాడారు.
గతంలో చేసిన పొరపాట్లను వైసీపీ శ్రేణులు సరిదిద్దుకొని ముందుకెళ్లాలన్నారు. ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. వైసీపీ కూడా రుణమాఫీ చేస్తామని ప్రజలకు అబద్ధం చెప్పి ఉంటే అధికారం దక్కేదన్నారు. అటువంటి మోసం చేయడం వల్లే బాబు గెలిచారన్నారు.
ఏపీ ప్రభుత్వ పాలన పైన ప్రజలకు తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని, అధికారమిచ్చిన ఆరు నెలలకే అబద్దపు హామీని ప్రజలు నమ్మడంతో పాటు నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ కూడా కలిసి వచ్చిందన్నారు. బ్యాంకులు అపరాధ వడ్డీ పేరుతో రైతుల నుండి మరింత మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేస్తున్నాయన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఆశించారని, కానీ ఎవరికీ రాలేదన్నారు.
ఒక్కసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపడితే 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటానని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిలా ప్రజల గుండెల్లో చిరస్ధాయిగా నిలిచిపోతానన్నారు.
అర్ధరాత్రి వరకు ఆసుపత్రిలోనే...
అనంతపురం జిల్లాలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని జగన్ గురువారం నాడు పరామర్శించారు. రాత్రి పది గంటల నుండి అర్ధరాత్రి వరకు ఆయన హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోనే గడిపారు. చికిత్స పొందుతున్న ఒక్కొక్కరిని పలకరిస్తూ, ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. నిలదీస్తా: రాజన్న దొర
తన నియోజకవర్గంలో అభివద్ధిని జిల్లాకు చెందిన నేతలు అడ్డుకుంటున్నారని వైసీపీ సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర ఆరోపించారు. ఆయన విజయనగరంలో విలేకరులతో మాట్లాడారు. ఓ వైపు అభివృద్ధి జరగాలనని సీఎం చంద్రబాబు సాక్షాత్తు ప్రకటన చేస్తుంటే, మరోవైపు జిల్లాకు చందిన మంత్రి, జిల్లా పరిషత్ చైర్మన్, స్థానిక నేతలు అడ్డుకోవడం శోచనీయమన్నారు. దీనిపై సీఎం, స్పీకర్లకు లేఖ రాస్తానని చెప్పారు.