కొత్త జిల్లాలపై జగన్ ప్రకటన: కీలక అభ్యంతరాలివే: తుది నోటిఫికేషన్కు ముహూర్తం ఇదే
అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కసరత్తు తుది దశకు చేరుకుంది. ఉగాది నుంచి కొత్త జిల్లాలు తెర మీదికి రాబోతోన్నందున.. దీనికి సంబంధించిన తుది నోటిఫికేషన్ను విడుదల చేయడానికి సన్నహాలు చేస్తోంది. వచ్చేవారం ఈ నోటిఫికేషన్ వెలువడనుంది. కొత్త జిల్లాలకు ఉద్యోగులు, ఫర్నిచర్ కేటాయింపులు దాదాపుగా ముగిసిందని తెలుస్తోంది. మూడు, నాలుగు జిల్లాల్లో ఉద్యోగులు, ఫర్నిచర్ పంపకాలు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైనల్ డ్రాఫ్ట్
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన తుది నివేదిక ఫైనల్ డ్రాఫ్ట్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిందని అంటున్నారు. ఇందులో కొన్ని మార్పుల కోసం ఆయన మళ్లీ వెనక్కి పంపించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఇందులో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. ఆ మార్పుల తరువాత ఈ నెలాఖరు నాటికి తుది నోటిఫికేషన్ జారీ కానుంది. 29 లేదా 30 తేదీల్లో తుది నోటిఫికేషన్ వెలువడొచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఎల్లుండి సభలో జగన్ కీలక ప్రకటన
కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి శాసనసభలో ప్రకటన చేస్తారని సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం నాడు ఆయన ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం వాటి వివరాలను ఆయన అసెంబ్లీ సాక్షిగా వెల్లడిస్తారని తెలుస్తోంది. ఆ తరువాత కూడా అభ్యంతరాలు ఏవైనా ఉంటే ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకుంటుందని అంటున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదిక..
పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రాతిపదికన తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇదివరకే వెలువడింది. మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. వాటిపై అభ్యంతరాలు, సూచనలు, సలహాల కోసం ఈ నెల 3వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. 12 నుంచి 13 వేల వరకు అభ్యంతరాలు అందినట్లు చెబుతున్నారు. ఇందులో వైఎస్ జగన్ సొంత జిల్లా కడప, విజయనగరం, కృష్ణా జిల్లాల నుంచి అధికంగా సూచనలు అందాయి.
అభ్యంతరాలివే..
రాయచోటికి బదులుగా రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు, తిరుపతి కేంద్రంగా ఏర్పాటు కానున్న శ్రీబాలాజీ జిల్లా పేరు మార్పు, నగరి నియోజకవర్గాన్ని చిత్తూరులో కాకుండా తిరుపతి జిల్లాలో విలీనం చేయడం వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటించాలంటూ పలు విజ్ఞప్తులు అందాయి. సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తికి బదులుగా హిందూపురాన్ని ప్రకటించాలంటూ విజ్ఞప్తులు వచ్చాయి.
కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లా పేరును ఎన్టీఆర్గా మార్చడాన్ని కూడా వ్యతిరేకిస్తూ పలు అభ్యంతరాలు అందాయి. ఎన్టీఆర్కు బదులుగా వంగవీటి మోహనరంగా పేరును ఈ జిల్లాకు పెట్టాలంటూ వందలాది విజ్ఞప్తులు అందినట్లు చెబుతున్నారు. ఎన్టీ రామారావు జన్మించిన నిమ్మకూరును మచిలీపట్నం జిల్లాలో విలీనమౌతుందని, ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టాలంటూ పలు విజ్ఞప్తులు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టర్లకు అందాయి.
సమగ్ర నివేదిక..
ఆయా అభ్యంతరాలన్నింటినీ క్రోడీకరించిన అధికారులు ఓ సమగ్ర నివేదికను రూపొందించారు. దీని ఆధారంగా తుది నోటిఫికేషన్కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఈ నివేదికపై అధికారులు వైఎస్ జగన్కు వివరించారు. కొత్త జిల్లా కలెక్టర్ల కార్యాలయాల మరమ్మతుల కోసం ప్రభుత్వం 42 కోట్ల రూపాయలను కేటాయించింది. భవనాల మరమ్మతు పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయి. ఫర్నిచర్ కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. మూడు, నాలుగు జోట్ల తరలింపు మిగిలి ఉన్నప్పటికీ.. ఈ వారాంతలోగా అవి కూడా పూర్తవుతాయని అంటున్నారు.