జగన్కు బేషరతు మద్దతు: ఆహ్వానించిన కూటమి: ఢిల్లీ వేదికగా
YS Jagan Mohan Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత చోటుచేసుకుంటోన్న హత్యలు, అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా దేశ రాజధాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైంది.
చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, దాడులపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ నిర్వహించిన ఆందోళనలకు జాతీయ స్థాయి ప్రతిపక్షాల నుంచి మంచి స్పందన లభించింది. వివిధ జాతీయ పార్టీల నాయకులు, అధికార ప్రతినిధులు, లోక్సభ సభ్యులు దీనికి హాజరయ్యారు.

సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) నాయకుడు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ నేత నదీముల్హక్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఏడీఎంకే, ఇండియన్ ముస్లిం లీగ్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారు.
ఈ ఆందోళనలో సంఘీభావం తెలిపిన పార్టీలు, నాయకులకు వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఆందోళనను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో జరుగుతున్న హేయమైన దాడులు, హత్యలు, అత్యాచారాల పట్ల జాతీయ స్థాయిలో తాము ఉద్యమిస్తామని జగన్ తెలిపారు.
ఈ నిరసనలకు ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా మద్దతు తెలిపింది. కూటమి భాగస్వామ్య పక్షమైన సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొన్న ఫొటోలను తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఏపీలో ఎన్డీఏ కూటమి పాలనలో నెలకొన్న అరాచకాలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ చేపట్టిన ఆందోళనలకు మద్దతు ఇచ్చినట్లు వెల్లడించింది.
దీనికి కొనసాగింపుగా.. గేమ్ ఈజ్ ఆన్ అంటూ కామెంట్ పెట్టింది ఇండియా కూటమి. ఈ పరిణామాలు- ఇక జగన్ ఎన్నో రోజుల పాటు రాజకీయాల్లో తటస్థుడిగా కొనసాగలేవనే సంకేతాలను ఇచ్చినట్టయింది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే మిత్రపక్షం వీసీకే పార్టీ ఎంపీ తిరుమావళవన్ సైతం వైఎస్ఆర్సీపీని.. ఇండియా కూటమిలో చేరాలని ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications