వెంకయ్య ఎఫెక్ట్, వైసిపికి కొత్త సమస్య: జగన్ ముందు ప్రశ్నలెన్నో
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు మద్దతు పలికిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం చిక్కులు ఎదురవనున్నాయని అంటున్నారు.
అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు మద్దతు పలికిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం చిక్కులు ఎదురవనున్నాయని అంటున్నారు.
కేంద్రమంత్రి, ఏపీ నేత వెంకయ్య నాయుడు కనుక ఉప రాష్ట్రపతి అభ్యర్థి అయితే జగన్ కచ్చితంగా ఇరకాటంలో పడినట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, దానిని బిజెపి నెరవేర్చలేదనే విమర్శలు ఉన్నాయి.

జగన్కు చిక్కు
హోదా కోసం రాజీనామాలకు సైతం సిద్ధమన్న జగన్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాంటి షరతు విధించకుండా మద్దతు పలకడంపై కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు భగ్గుమంటున్నాయి. జగన్ ఓ మంచి అవకాశం కోల్పోయాడని చెబుతున్నారు.

రామ్నాథ్ వేరు
రామ్నాథ్ కోవింద్ యూపీకి చెందిన వారు. కాబట్టి విమర్శలను వైసిపి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యకు మద్దతు ఇస్తే మాత్రం జగన్కు చిక్కులు తప్పవని అంటున్నారు.

వెంకయ్యకు మద్దతిస్తే చిక్కులెన్నో
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫున వెంకయ్య నిలిస్తే జగన్ ముందు ఎన్నో చిక్కులు ఉన్నాయంటున్నారు. కోవింద్ తెలుగు వారు కాదు. కానీ వెంకయ్య ఏపీకి చెందిన వ్యక్తి. పైగా, విభజన బిల్లు సమయంలో ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని రాజ్యసభలో గట్టిగా పోరాడారు. ఇప్పుడు మాత్రం హోదాపై బిజెపి నాలుక మడత వేసింది.
Recommended Video


నేను ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహించకున్నా..
హోదా గురించి గట్టిగా నిలదీస్తే తాను ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహించడం లేదని, తెలుగువాడిగా తాను నవ్యాంధ్ర అభివృద్ధి కోసం తాపత్రయపడుతున్నానని వెంకయ్య ఒకటికి రెండుసార్లు అన్నారు. తెలుగు వ్యక్తి అయి ఉండి హోదా కోసం కేంద్రంలో చక్రం తిప్పకపోవడం, నాడు గట్టిగా పోరాడటం వంటి అంశాలు వెంకయ్యను ఇరుకున పెట్టాయి. జగన్ కూడా చంద్రబాబుతో పాటు వెంకయ్యను ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే వెంకయ్యకు మద్దతు పలికితే జగన్కు చిక్కులే అంటున్నారు.












Click it and Unblock the Notifications