సీమాంధ్ర పర్యటన: కోర్టులో వైయస్ జగన్ మెమో?
హైదరాబాద్: దాదాపు పూర్తిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణను వదిలేసింది. ఈ స్థితిలో సీమాంధ్రలో పూర్తి స్థాయిలో సత్తాను చాటడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు బెయిల్ రావడంతో సీమాంధ్రలో పార్టీ పరిస్థితి మరింత మెరుగవుతుందని భావిస్తున్నారు. సమైక్య నినాదంతో వైయస్ జగన్ సీమాంధ్రలో పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకుంటారని కూడా భావిస్తున్నారు.
కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని నాంపల్లి సిబిఐ కోర్టు జగన్కు షరతు విధించింది. దీంతో కొన్నాళ్ల పాటు జగన్ హైదరాబాద్లో ఉండి, పార్టీ పరిస్థితిని, రాష్ట్ర పరిస్థితిని సమీక్షించి, వ్యూహాలను రచించుకుంటారని, ఆ తర్వాత సీమాంధ్ర పర్యటనకు పూనుకుంటారని చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యతలను నెరవేర్చడానికి తన రాష్ట్ర పర్యటనకు అనుమతించాలని కోరుతూ జగన్ కోర్టులో మెమో దాఖలు చేసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
కోర్టు షరతు జగన్ పర్యటనకు ఆటంకంగా మారుతుందనే అభిప్రాయం ఏ ఒక్క నాయకుడు వ్యక్తం చేయడం లేదు. సీమాంధ్రలో జగన్తో పార్టీ ఊపు వస్తుందని, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఇప్పటికే 17 మంది శాసనసభ్యులున్నారు. వీరంతా సీమాంధ్రకు చెందినవారే కావడం విశేషం.
సీమాంధ్రలో 175 అసెంబ్లీ సీట్లు, 25 లోకసభ స్థానాలున్నాయి. వీటిలో 70 నుంచి 80 శాతం సీట్లకు వైయస్ జగన్ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. సీమాంధ్రలో ముక్కోణపు పోటీ జరుగుతుందని భావిస్తున్నారు. అయితే, ప్రధాన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అవసరమైనచోట కాంగ్రెసుకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్య అవగాహన కుదరవచ్చునని, రెండు పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడానికి ప్రయత్నించవచ్చునని ప్రచారం సాగుతోంది.
కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కలిసి సీమాంధ్రలో తమ పార్టీని దెబ్బ తీసే ప్రమాదం ఉండడం వల్లనే చంద్రబాబు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెసు పార్టీ వైయస్సార్ కాంగ్రెసుతో పొత్తుకు వెనకాడకపోవచ్చునని అంటున్నారు. ఎన్నికల తర్వాత యుపిఎతో కలిసి పనిచేసే విషయాన్ని ఆలోచిస్తామని జగన్ ఇప్పటికే చెప్పారు. ఎన్డిఎతో కలిసేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోబమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతున్నప్పటికీ దాని ముఖ్యమైన టార్గెట్ మాత్రం తెలుగుదేశం పార్టీయేనని చెబుతున్నారు.