లోకేష్, పవన్ కల్యాణ్ యాత్రలకు సీఎం జగన్ చెక్?
ఎన్నికలయ్యేంతవరకు నిత్యం ప్రజల్లో ఉండేలా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రణాళికలు రచించుకున్నారు. జనవరి 27వ తేదీ నుంచి 4వేల కిలోమీటర్ల దూరం పాదయాత్రకు లోకేష్ శ్రీకారం చుడుతున్నారు. యువగళం పేరుతో ఎన్నికలయ్యేంతవరకు, లేదంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేంతవరకు యాత్ర ను కొనసాగించబోతున్నారు. కుప్పం నుంచి యాత్ర ప్రారంభం కాబోతోంది.

రేపు వారాహికి పూజలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో రేపు పూజలు నిర్వహించబోతున్నారు. జనవరి నుంచే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని పవన్ భావిస్తున్నారు. ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేసేందుకు మధ్య మధ్యలో విరామం ఇస్తారు. బస్సు యాత్రద్వారా ఎన్నికల షెడ్యూల్ వచ్చేంతవరకు ప్రజల్లోనే ఉండాలని పవన్ భావిస్తున్నారు. సంక్రాంతి పర్వదిన సమయానికి యాత్రపై జనసేన వర్గాలు పూర్తి స్పష్టత ఇవ్వబోతున్నాయి.

పార్టీ తరఫున కూడా ఇద్దరు వాలంటీర్లు
తెలుగుదేశం, జనసేన ఇలా ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తుండటంతో అధికార పార్టీ ఏం చేస్తుందా? అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇప్పటికే 175కు 175 నియోజకవర్గాలు కైవసం చేసుకోవాలని జగన్ టార్గెట్ పెట్టారు. దీనిలో భాగంగానే నియోజకవర్గంలో కీలకంగా ఉన్న 50 మంది కార్యకర్తలను ఎంపిక చేసి, వారితోపాటు ఎమ్మెల్యేతోను, ఇన్ ఛార్జితోను సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరఫున వాలంటీర్లు ఎలా ఉన్నారో అలాగే పార్టీ తరఫున మరో ఇద్దరు వాలంటీర్లను నియమించబోతున్నారు. వారి బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించారు.

మార్చి నుంచి పర్యటనలకు శ్రీకారం?
తెలుగుదేశం, జనసేన ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేసుకోవడంతో అధికార పార్టీ వ్యూహం ఎలా ఉండాలనేదానిపై సీనియర్ నేతలతో జగన్ సమాలోచనలు జరిపారు. ప్రభుత్వం తరఫున వివిధ పదవుల్లో ఉన్నవారిని ఇకనుంచి పార్టీ కోసం పనిచేయించుకోవడానికి వినియోగించుకోబోతున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కూడా ఆ పదవి నుంచి తొలగించి ఉత్తరాంధ్ర బాధ్యతలన్నీ అప్పగించాలనే యోచన చేస్తున్నారు. అలాగే ప్రభుత్వంలోను పార్టీలోను కీలకంగా ఉన్నవారిని గుర్తించి వారిని పార్టీ కోసమే పనిచేసేలా సిద్ధం చేయించబోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ కూడా నిత్యం ప్రజల్లో పర్యటిస్తుండటంవల్ల పార్టీకి ఎనలేని లాభం కలుగుతుందని, ఇలా చేయడంవల్ల పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుందని సీనియర్ నేతలు జగన్ కు సూచించారు. మార్చి తర్వాత వైఎస్ జగన్ కూడా పర్యటనలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications