జగన్ మాతో చర్చించనే లేదు, అయినా కూడా...: మేకపాటి
నెల్లూరు: ఆంధ్రప్రదేశకు ప్రత్యేకహోదా సాధన కోసం పార్లమెంటు సభ్యులతో రాజీనామా చేయిస్తానని ప్రకటించిన తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ అంశంపై తమతో చర్చించలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ నేత, నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహనరెడ్డి తెలిపారు. అయితే హోదా కోసం రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు.
ప్రత్యే క హోదాకు ఏదీ ప్రత్యామ్నాయం కాదని, ఎంత ఆర్థిక సాయం చేసినా దానివల్ల ఒరిగేదేమీ లేదని గురువారం నెల్లూరులో మీడియాతో అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోగా హోదా రాకపోతే ఎంపీల చేత రాజీనామా చేయిస్తామన్న తమ అధ్యక్షుడు జగన్ ప్రకటనపై ఆయన స్పందించారు.
పార్టీ అధినేత ఎలా చెబితే అలా నడవాల్సిందేనని, అయితే ఈ విషయమై జగన్ తమ చర్చించలేదని అన్నారు. హోదా కోసం ఎన్ని పోరాటాలకైనా సిద్ధమేనని, రాజీనామాలు అవసరమైతే అధినేత సూచనలు పాటిస్తామని మేకపాటి అన్నారు.
పార్లమెంటులో హోదా పై చర్చించి గట్టిగా మాట్లాడి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం సాగిస్తామని, అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అనుకుంటే ఏపీకి హోదా వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ, టీడీపీ మేనిఫెస్టోల్లో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన సంగతి మరచిపోతే ఎలా? చంద్రబాబు, వెంకయ్య కేంద్రాన్ని గట్టిగా అడిగితే హోదా వస్తుందని ఆయన అన్నారు.