సమైక్యంలో మలుపు: అశోక్బాబుకు జగన్ చెక్?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బెయిల్పై విడుదల కావడంతో సమైక్యాంధ్ర ఉద్యమం కొత్త మలుపు తిరిగిన సూచనలు కనిపిస్తున్నాయి. సమైక్యాంధ్రను భుజాన వేసుకున్న ఏకైక పార్టీగా క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తోంది. తద్వారా సీమాంధ్రలో మరో పార్టీకి స్థానం లేకుండా చేయాలనేది ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆలోచనగా అర్థమవుతోంది.
సమైక్యాంధ్ర ఉద్యమ నేతగా అవతరించడానికి ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు తీవ్రంగా ప్రయత్నించారు. ఒక రకంగా సమైక్యాంధ్ర ఉద్యమానికి సంకేతంగా నిలిచే పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో ఆయన ప్రాబల్యానికి వైయస్ జగన్ చెక్ పెట్టినట్లు భావిస్తున్నారు. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని తొలి రోజుల్లో అశోక్ బాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను పి. అశోక్ బాబు కోరారు. ఆ తర్వాత ఆ పార్టీకి దూరం జరుగుతూ వచ్చారు.
జైలు నుంచి జగన్ విడుదలైనా సమైక్యాంధ్ర ఉద్యమంలో వచ్చే మార్పేమీ లేదని అశోక్ బాబు ఓ సందర్భంలో అన్నారు. దీన్నిబట్టి అశోక్ బాబు తమకు అనుకూలంగా లేరనే విషయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు స్పష్టతకు వచ్చారని చెబుతున్నారు. దీంతో అశోక్ భాబును పక్కన పెట్టి ఇతర సీమాంధ్ర నాయకులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేరదీసినట్లు సమాచారం.
శుక్రవారం ఢిల్లీలో విజయమ్మ చేసిన ప్రకటన కూడా అశోక్ బాబుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పెరిగిన దూరాన్ని తెలియజేస్తోంది. రాష్ట్రాన్ని విభజించకూడదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇవ్వాలని వైయస్ జగన్ సీమాంధ్ర ఉద్యోగులకు సూచించారు. ఆ వినతిపత్రంలో మొదటి సంతకం తానే చేస్తానని కూడా చెప్పారు. అయితే, అశోక్ బాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని తప్పు పట్టే ప్రయత్నం చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు ఓ మాట మాట్లాడుతున్నారు, శానససభ్యులు మరో మాట మాట్లాడుతున్నారని అశోక్ బాబు అన్నారు. దానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తామంతా ఒక్కటే మాట మాట్లాడుతున్నామని ఆమె చెప్పారు.
రాజీనామాలను ఆమోదింపజేసుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు సిద్ధమైన తరుణంలో సీమాంధ్ర శాసనసభ్యులు రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని అశోక్ బాబు ప్రకటన ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఇరకాటంలో పెట్టేందుకే అశోక్ బాబు అలాంటి ప్రకటన చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది.
శానససభలో తెలంగాణ తీర్మానం నెగ్గడానికి వీలుగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని చూస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేశారు. ఈ స్థితిలో అశోక్ బాబు ప్రకటన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మింగుడపడని వ్యవహారంగా మారింది. సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించి, క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర ఉద్యోగుల్లో ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఢిల్లీలో సీమాంధ్ర ఉద్యోగులు నిర్వహించిన ధర్నాకు వైయస్ విజయమ్మ హాజరయ్యారు. వారికి తమ మద్దతు ప్రకటించారు. తమ పార్టీది ఒక్కటే మాట అని, తాము రాష్ట్రాన్ని విభజించకూడదని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఈ రకంగా అశోక్ బాబుకు చెక్ పెట్టే పనులను వైయస్సార్ కాంగ్రెసు తీవ్రం చేసినట్లు అర్థమవుతోందని అంటున్నారు.