ఏపీలో అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్- వెంటనే రిపేర్లు- స్కూళ్లకో స్పెషలాఫీసర్-జగన్ ఆదేశాలు
ఏపీలో పాఠాశాల విద్యాశాఖ పై సీఎం జగన్ ఇవాళ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఇందులో స్కూళ్లలో తాజా పరిస్ధితుల గురించి అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం సీఎం జగన్ పలు అంశాలపై వారికి కీలక ఆదేశాలు ఇచ్చారు. వీటిలో అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో పాటు అనేక అంశాలు ఉన్నాయి. వీటిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
Recommended Video


జగన్ పాఠశాల విద్యాసమీక్ష
ఏపీలో పాఠశాల విద్యాశాఖ పై సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో నాడు - నేడు రెండో దశ పనులు, ఇప్పటికే తొలిదశలో నాడు - నేడు పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లలో నిర్వహణ, వచ్చే ఏడాది విద్యాకానుక, 8వ తరగతి విద్యార్దులకు ట్యాబులు, తరగతిగదుల డిజిటలైజేషన్ తదితర అంశాలపై సీఎం సమీక్ష చేశారు. అలాగే ఇప్పటికే చేపట్టిన పనుల పురోగతిని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కీలక ఆదేశాలు ఇచ్చారు.

అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్
రాష్ట్రంలో నాడు - నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లలో నిర్వహణ బాగుండాలని సీఎం జగన్ అధికారుల్ని
ఆదేశించారు. దీనికోసం ఎస్ఓపీలను రూపొందించాలన్నారు. ఒక ప్రత్యేక అధికారికి స్కూళ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. స్కూళ్లకు కల్పించిన సౌకర్యాల నిర్వహణ విషయంలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు నిర్వహించేలా విధానం ఉండాలన్నారు. వచ్చే సమీక్షా సమావేశం నాటికి దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలన్నారు. ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను కూడా రూపొందించాలన్నారు. అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని జగన్ ఆదేశించారు. అత్యుత్తమ బోధనకు ఇది దోహదపడుతుందన్నారు.అలాగే
స్కూళ్లకు కాంపౌండ్ వాల్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు.

జగనన్న విద్యా కానుకపై
వచ్చే ఏడాది ఇచ్చే జగనన్న విద్యాకానుకకు సంబంధించి ఇప్పటినుంచే అన్నిరకాలుగా సిద్ధంకావాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఏప్రిల్ నాటికే విద్యా కానుక కింద అందించే వాటిని సిద్ధంచేసుకోవాలన్నారు. సమావేశంలో పిల్లలకు అందిస్తున్న యూనిఫామ్ నాణ్యతను ఆయన పరిశీలించారు. అలాగే రాష్ట్రంలో విద్యార్ధులకు ఇచ్చే ట్యాబ్ల పంపిణీపైనా సమీక్ష చేశారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందించే కార్యక్రమంపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. టెండర్లు ఖరారుచేసి వెంటనే ఆర్డర్ ఇవ్వాలని సీఎం ఆదేశమిచ్చారు. అలాగే తరగతి గదుల డిజిటలైజేషన్మీద సీఎం సమీక్ష చేశారు. స్మార్ట్ టీవీ లేదా ఇంటరాక్టివ్ టీవీ ఏర్పాటుపై కార్యాచరణసిద్ధంచేయాలని ఆదేశించారు. పాఠ్యపుస్తకాలకు సంబంధించిన కంటెంట్ను అందరికీ అందుబాటులో పెట్టాలని సూచించారు.
పీడీఎఫ్ ఫైల్స్ రూపంలో అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. దీనివల్ల లిబరల్గా అందరికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. అంతేకాక ప్రభుత్వేతర స్కూళ్లు ఎవరైనా ప్రభుత్వ ముద్రణా సంస్థ నుంచి పాఠ్యపుస్తకాలు కావాలనుకుంటే.. నిర్ణీత తేదీలోగా ఎన్ని పుస్తకాలు కావాలో వివరాలు తీసుకుని ఆమేరకు వాటిని అందించాలని ఆదేశించారు. ఎక్కడా కూడా పాఠ్యపుస్తకాల కొరత అనేది ఉండకూడదన్నారు.

బాలికల భద్రతపై
రాష్ట్రంలో బాలికల భద్రతపై అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. రక్షణ, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై స్కూళ్లలో విద్యార్థినులకు సరైన అవగాహన కల్పించాలన్నారు. గ్రామ సచివాలయం నుంచి మహిళా పోలీసు, ఏఎన్ఎం తరచుగా వీరిని కలిసి అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక మహిళా ఉపాధ్యాయురాలిని కౌన్సెలింగ్ కోసం నియమించాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మహిళల భద్రత కోసం దిశ యాప్ తో పాటు పలు కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో స్కూళ్లలోనూ విద్యార్దినులకు అవగాహన కల్పించాలన్నారు.












Click it and Unblock the Notifications