ఈనాడులో బాబు యాడ్ చూపించి, ఏకిపారేసిన జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన లోటస్ పాండులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రచారం సమయంలో చంద్రబాబు ప్రసంగానికి సంబంధించిన వీడియోను, టీడీపీ ఇచ్చిన ప్రకటనలను ఆయన రిలీజ్ చేశారు. టీడీపీ వస్తే రుణాలు తీరుస్తామని చెప్పిన యాడ్ చూపించారు. ఏబీఎన్లో వచ్చిన బాబు ప్రసంగం వీడియో, ఈనాడులో వచ్చిన యాడ్ను జగన్ చూపించారు.
జగన్ మాట్లాడుతూ... ఈ ఎన్నికలు విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరిగాయని తాను మొదటి నుండి చెబుతున్నానని అన్నారు. రాష్ట్రం విడిపోతే ఏపీకి అన్యాయం జరుగుతుందని తెలిసినా చంద్రబాబు ఎందుకు ఓటు వేయించారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారన్నారు. రాష్ట్రం విడిపోతే పరిస్థితిలు ఎలా ఉంటాయో చంద్రబాబుకు ముందే తెలుసునని చెప్పారు.
విడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో బాబుకు, జగన్కు తెలియదని చెప్పేందుకు వీలు లేదన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో తెలంగాణ, ఏపీ మేనిఫెస్టోలతో ముందుకు వెళ్లారన్నారు. వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన బాబు ఇప్పుడు కల్లిబొల్లి కారణాలు చెబుతున్నారు. బాబు రుణాల మాఫీ చేస్తానని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారని, సంతకాలు చేశారన్నారు.
తాము అధికారంలోకి వస్తే అన్ని రుణాలు మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం లేదా, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, ఇప్పుడు వేటిని చేయలేకపోతున్నారన్నారు. రుణమాఫీ పైన కోటయ్య కమిటీ వేసి... మీ అభిప్రాయలను ఎందుకు రుద్దుతున్నారన్నారు. కోటయ్య కమిటీ వేసి రుణమాఫీ పైన పరిధిని ఎందుకు విధిస్తున్నారన్నారు.
ఈనాడులో పెద్ద యాడ్..
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశార ఈనాడు పత్రికలో పెద్ద యాడ్ వచ్చిందని, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్, డ్వాక్రా రుణాల రద్దు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య.. తదితరాలు ఎన్నో చెప్పారన్నారు. ఇది పక్కన పెడితే రుణమాఫీ పై ఎందుకు మాట తప్పుతున్నారని ప్రశ్నించారు.
రుణమాఫీ పైన కుదరితే ఇస్తామని చెబుతుండటమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రం పరిస్థితి తెలిసి హామీలు ఇచ్చారన్నారు. ఎన్నికలకు ముందు ప్రతి సభలో రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని, బాబు వస్తాడు జాబు వస్తుంది, బాబు వస్తాడు రుణాలు మాఫీ అవుతాయని చెప్పారన్నారు. పట్టపగలే చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారన్నారు.
రాజధాని కోసం హుండీ..
ఓ వైపు డబ్బులు లేవంటూ.. రాజధాని కోసం హుండీ పెడతారని, ఎర్రచందనం అమ్మేసి బ్యాంకులకు తాకట్టు పెడతామని చెబుతున్నారని, ఇవన్నీ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టేందుకా అని ప్రశ్నించారు. సాధ్యం కాదని తెలిసినా కొన్నింటిని తాకట్టు పెట్టుతామని చెప్పడమేమిటన్నారు. రైతుల పైన 12 నుండి 14 శాతం వడ్డీ రుద్దే యత్నం చేస్తున్నారన్నారు. అడవులలోని చెట్లను కూడా బ్యాంకులకు తాకట్టు పెడతామంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రోజుకో అబద్దం, పూటకో అబ్దదం చెబుతున్నారన్నారు.