164 సీట్ల కూటమికి అడ్డుగా జగన్ చట్టం ! సవరణకు మండలీ ఇబ్బందే..!
ఏపీలో కూటమి సర్కార్ 164 సీట్ల భారీ మెజార్టీతో అధికారంలోకి రాగానే 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నుంచి భారీ ఎత్తున వలసలు ఉంటాయని అంతా ఊహించారు. ముఖ్యంగా కీలకమైన స్థానిక సంస్థల్లో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులంతా వెంటనే పార్టీ ఫిరాయించి కూటమి పార్టీల్లోకి చేరిపోతారని అనుకున్నారు. కానీ ఎంత భారీ మెజార్టీతో ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ ఫిరాయింపులను ప్రోత్సహించలేని దుస్థితి కనిపిస్తోంది. దీనికి కారణం గతంలో వైసీపీ సర్కార్ ముందుచూపుతో తీసుకున్న ఓ నిర్ణయమే.
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలకు మద్దతుగా జనం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేయడం, నేతలు కూడా అధికార పార్టీలోకి ఫిరాయించి నిధులు తెచ్చుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ వైసీపీ హయాంలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తాడిపత్రి మినహా అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను క్లీన్ స్వీప్ చేసిన ఆ పార్టీ.. పనిలో పనిగా ఓ చట్టం తీసుకొచ్చింది. స్దానిక సంస్ధల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు నాలుగేళ్ల లోపు ఫిరాయింపులకు పాల్పడకుండా ఈ చట్టం తెచ్చింది. అలా ఫిరాయిస్తే ఆటోమేటిగ్గా వారిపై అనర్హత వేటు పడుతుందన్నమాట.

ఇప్పుడు ఈ చట్టం అమల్లో ఉండటంతో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినా స్థానిక సంస్థల్లో మాత్రం వైసీపీ హవా కొనసాగుతోంది. అలాగే శాసనమండలిలోనూ వైసీపీ మెజార్టీ ఉండటంతో ఈ చట్టాన్ని అంత సులువుగా సవరించే పరిస్ధితి కూటమికి లేకుండా పోతోంది. తాజాగా జీవీఎంసీలో కొందరు వైసీపీ కార్పోరేటర్లను తమ వైపుకు తిప్పుకున్న కూటమికి వారితో మేయర్ పై అవిశ్వాసం పెట్టించే పరిస్థితి లేదు. దీంతో మరో ఏడాది పాటు వారు వేచి చూడక తప్పదు. అలాగని ఈ చట్టాన్ని సవరించాలంటే శాసనసభతో పాటు మండలిలోనూ మెజార్టీ అవసరం. ఇది లేకపోవడంతో కూటమికి ఎదురుచూపులు తప్పడం లేదు.












Click it and Unblock the Notifications