175 గెలవాల్సిందే-మరోసారి తేల్చిచెప్పిన జగన్-ఇక గడప గడపపై నెలకో వర్క్ షాప్ ..
ఏపీలో 2024 ఎన్నికల కోసం వ్యూహరచనలో ఉన్న వైసీపీ అధినేత,సీఎం జగన్ ఇవాళ తాడేపల్లిలో నిర్వహించిన పార్టీ ముఖ్యుల వర్క్ షాప్ లో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోవైసీపీ విజయానికి ఎలా పనిచేయాలన్న దానిపై ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు, కీలక నేతలకు జగన్ సూచనలు చేశారు. ఇప్పటికే ఏపీలో వరుస విజయాలు సాధిస్తున్న వైసీపీ.. వచ్చే ఎన్నికల్లోనూ అన్ని స్ధానాలూ గెల్చుకోవాలని జగన్ టార్గెట్ పెట్టారు.
వైసీపీ వర్క్ షాప్
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయింది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో వైసీపీ తిరిగి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో పాటు అన్ని స్ధానాల్ని కైవసం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే గడప గడపకూ ప్రభుత్వంకార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ నేతలు.. ఇందులో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.వాటి ఆధారంగా తదుపరి వ్యూహం ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే క్షేత్రస్ధాయిలో పర్యటించిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో జగన్ ఇవాళ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు.
175 కష్టం కాదన్న జగన్
వచ్చే ఎన్నికల్లో వైసీపీ మరోసారి భారీ మెజారిటీతో అదికారంలోకి రావాలని సీఎం జగన్ ఇవాళ నిర్వహించిన వైసీపీ వర్క్ షాప్ లో పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. గతంలో 151 సీట్లు గెల్చుకున్న వైసీపీ.. ఈసారి 175 సీట్లు గెల్చుకోవాలని ఆయన మరోసారి నేతలకు టార్గెట్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధించడం మన లక్ష్యమని, ఇది కష్టమేమీ కాదని జగన్ నేతలకు తెలిపారు. ఇందుకు అనుగుణంగా నేతలు పనిచేయాలని జగన్ పిలుపునిచ్చారు. అప్పుడే టార్గెట్ అందుకోగలమన్నారు.
కుప్పం గెలుస్తామనుకున్నామా ?
గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిధిలో ఉన్న కుప్పం మున్సిపాలిటీని గెలుస్తామని అనుకున్నామా అని సీఎం జగన్ పార్టీ నేతల్ని ప్రశ్నించారు. కుప్పంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీల్ని క్లీన్ స్వీప్ చేస్తామనుకున్నామా అని నేతలు అడిగారు. అదే తరహాలో ఈసారి రాష్ట్రంలో 175 కు 175 సీట్లు గెలిచి తీరాలని సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలకు టార్గెట్ పెట్టారు. ఈసారి కుప్పం సహా అన్ని సీట్లు గెలవాల్సిందేనని స్పష్టం చేశారు.
వైసీపీ ప్లాన్ ఇదే
ప్రస్తుతం వైసీపీ నిర్వహిస్తున్న గడప గడపకూ ప్రభుత్వం నిరంతర కార్యక్రమమని, దాదాపు 8 నెలల పాటు ఇది కొనసాగుతుంందని జగన్ తెలిపారు. నియోజకవర్గాల్లో ఒక్కో సచివాలయం పరిధిలో రెండేసి రోజుల చొప్పున 10 సచివాలయాల పరిధిలో దీన్ని నిర్వహించాలన్నారు. ఇకపై నెలకో వర్క్ షాప్ నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. గడప గడపకూ కార్యక్రమంలో జనం నుంచి వచ్చే స్పందనపై వర్క్ షాప్ లో చర్చించనున్నారు. ఇందులో వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని జగన్ నేతలకు స్పష్టం చేశారు.