లాగి చెంపపై కొట్టండి: దిగ్విజయ్పై జగన్ వ్యాఖ్య
హైదరాబాద్: కాంగ్రెసి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. జగన్ డిఎన్ఎ తమ పార్టీదేనని దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యపై ఆయన ప్రతిస్పందించారు. దిగ్విజయ్ సింగ్ను లాగి చెంపపై కొట్టండని ఆయన అన్నారు. ఆయన శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను ఓటమిని అంగీకరించనని, గెలిచే వరకు పోరాటం చేస్తానని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర విభజనపై కేంద్రం అనుసరించిన వైఖరిపై ఆయన ఆవేదిన వ్యక్తం చేశారు ఇంకెంత కాలం రాష్ట్రాన్ని మోసం చేస్తారని ఆయన అడిగారు. ఆర్టికల్ 3ని మార్పించడానికి నెల రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నానని, ప్రతి రాష్ట్రం తిరిగానని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి మద్దతు ఇవ్వబోమని ఇప్పటికే పలుసార్లు చెప్పానని, ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారిని ప్రధానిని చేస్తామని ఎప్పుడో చెప్పానని ఆయన అన్నారు. 70 రోజుల తర్వాత ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోతుందని, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
సమైక్యాన్ని కోరుతూ చంద్రబాబు ఎందుకు లేఖ ఇవ్వడం లేదని ఆయన అడిగారు. కుప్పం వెళ్తే చంద్రబాబును నిలదీస్తారని ఆయన అన్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో చంద్రబాబును అడగండని ఆయన అన్నారు అసెంబ్లీ ముందు సమైక్య తీర్మానం ఒక్కటే మార్గమని ఆయన అన్నారు. సమైక్యం కోసం చివరి దాకా పోరాటం చేస్తానని ఆయన చెప్పారు.
కిరణ్ కుమార్ రెడ్డి విభజనకు పూర్తిగా సహకరిస్తూ పోతూ ఉంటాడని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురు పార్లమెంటు సభ్యుల్లో నలుగురు మాత్రమే అవిశ్వాసం నోటీసు ఇస్తారని, మిగతా ఇద్దరు కనిపించడం లేదని, ఇద్దరిని అటువైపు పంపిస్తారని ఆయన అన్నారు. నీళ్ల కోసం ఉద్యోగాల కోసం కుప్పం ప్రజలు నిలదీస్తారని ఆయన అన్నారు.
సాయంత్రం పూట మీడియా సమావేశం ఏర్పాటు చేసి ట్యూషన్ చెప్పినట్లు చెబుతారని ఆయన అన్నారు. వారం రోజులుగా మీడియా సమావేశం పెడుతున్నా నోట సమైక్యమనే మాట చంద్రబాబు అనడం లేదని ఆయన అన్నారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో ఈ మార్పు రావాలని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల శాసనసభ్యులకు విన్నపం చేయడానికి ఈ మీడియా సమావేశం పెట్టానని, మీ ఆత్మప్రబోధానుసారం వెళ్లాలి, సమైక్య తీర్మానం చేయాలని పట్టుబట్టి, రాష్ట్రాన్ని కలిసి కట్టుగా ఉంచాలని కోరడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశానని ఆయన అన్నారు. జగన్ ఒక్కడి వల్లనే ఇది సాధ్యం కాదని, జగన్ రెడ్డికి సహకారం కావాలని ఆయన అన్నారు.
కిరణ్ రెడ్డి ఏం చెప్పినా, చంద్రబాబు ఏం చెప్పినా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని, సమైక్యానికి అనుకూలంగా తీర్మానం చేయాలని ఆయన అన్ని పార్టీల శాసనసభ్యులను కోరారు.