అసెంబ్లీపై జగన్ విజ్ఞప్తికి నో: ఎన్టీఆర్కు బాబు నివాళి
హైదరాబాద్: శాసనసభా సమావేశాలను సెప్టెంబర్ 12వ తేదీ వరకు నిర్వహించాలనే ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన విజ్ఞప్తిని బిఎసి సమావేశం తిరస్కరించింది. బిఎసి సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చివరి నిమిషంలో హాజరైంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున వైయస్ జగన్, జ్యోతుల నెహ్రూ బిఎసి సమావేశానికి హాజరయ్యారు. బిఎసిలో తమకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని నిరసన జగన్ నిరసన వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలను సెప్టెంబర్ 6వ తేదీ వరకు నిర్వహించాలని బిఎసి సమావేశం నిర్ణయియంచింది. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సమావేశాలను కుదించుకుంది.
బుధవారంనాడు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సాధారణ బడ్జెట్ను సభలో ప్రవేశపెడుతారు. దానిపై ఈ నెల 26వ తేదీ వరకు చర్చ జరుగుతుంది. ఈ నెల 22వ తేదీ ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను ప్రభుత్వం ప్రతిపాదించనుంది. సమావేశాలు 16 రోజుల పాటు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించారు. ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన తర్వాత ఆయన శాసనసభకు బయలుదేరారు. శాసనసభా సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైయస్సార్ కాంగ్రెసు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద రావు తిరస్కరించారు. అయితే, తాము ప్రతిపాదించిన వాయిదా తీర్మానంపై వెంటనే చర్చ జరపాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.