కేంద్రంపై జగన్ ఎదురుదాడి-చంద్రబాబుకు ఊహించని షాక్-ముందునుయ్యి వెనుక గొయ్యి...
దేశవ్యాప్తంగా దీపావళి కానుక పేరుతో పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్ని కుదిపేస్తోంది. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం.. రాష్ట్రాల్ని వ్యాట్ తగ్గించమని కోరడంతో ఇప్పుడు అది రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఏపీలో వైసీపీ సర్కార్ కేంద్రం సూచనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎదురుదాడికి దిగడంతో ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేయాలనుకున్న టీడీపీ ఇరుకునపడుతోంది. అదే సమయంలో తాను మాత్రం బీజేపీపై ఎదురుదాడి చేయలేని పరిస్ధితుల్లో చిక్కి విలవిల్లాడుతోంది. దీంతో అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రంపై ఎదురుదాడి చేస్తున్న వైసీపీ వ్యూహాలు టీడీపీకి అంతుబట్టడం లేదు.
కేంద్రం పెట్రో ఊరట
కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక పేరుతో పెట్రోల్, డీజిల్ తో పాటు ఇతర చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకూ జనానికి ఊరట దక్కింది. అదే సమయంలో రాష్ట్రాల్ని సైతం వ్యాట్ తగ్గించాలని సూచించింది. దీన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పాలిత పంజాబ్ కూడా పాటించింది. కానీ మిగతా రాష్ట్రాలు మాత్రం కేంద్రం సూచనను పక్కనబెట్టేశాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటు మిగతా బీజేపీయేతర, కాంగ్రెసేతర, కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కేంద్రం చేసిన సూచనను ఈ రాష్ట్రాలు పాటించకపోవడంతో ఆయా చోట్ల బీజేపీతో పాటు ఆ పార్టీకి సన్నిహితంగా మెలుగుతున్న, మెలగానుకుంటున్న పార్టీలు దీన్ని రాజకీయం చేయడం మొదలుపెట్టాయి. ఇదే కోవలో ఏపీలోనూ వైసీపీ, టీడీపీ మధ్య రసవత్తరమైన పోరు సాగుతోంది. అదే క్రమంలో వైసీపీ వేస్తున్న అడుగులు టీడీపీని ఇరుకునపెడుతున్నాయి.
వైసీపీ రివర్స్ అటాక్
కేంద్రం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించి, తమను వ్యాట్ తగ్గించాలని కోరడంపై రెండు రోజుల పాటు మౌనంగా ఉన్న వైసీపీ ఆ తర్వాత నెమ్మదిగా ఈ సూచనపై స్పందించడం మొదలుపెట్టింది. ముందుగా డిప్యూటీ సీఎం ధర్మాన కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూనే సరైన సమయంలో దీనిపై స్పందిస్తామన్నారు. అయితే ఆ తర్వాత ఆర్ధికమంత్రి బుగ్గన, రవాణామంత్రి పేర్నినాని, సలహాదారు సజ్జల మాత్రం రివర్స్ అటాక్ మొదలుపెట్టేశారు. కేంద్రం ఐదు రూపాయలు తగ్గించి తమను వ్యాట్ తగ్గించమని కోరడమేంటని ఎదురుదాడికి దిగారు. తాము వ్యాట్ తగ్గించలేమని తేల్చిచెప్పేశారు. అంతటితో ఆగకుండా పౌరసరఫరాలమంత్రి కొడాలి నాని కేంద్రం పెట్రో ఉత్పత్తుల పేరుతో కోట్లు కొల్లగొట్టి.. ఇప్పుడు తమను వ్యాట్ తగ్గించమని కోరడంపై ఇవాళ తీవ్ర విమర్శలకు దిగారు. దీంతో వైసీపీ వర్సెస్ బీజేపీ రాజకీయం ముదురుతోంది.
వైసీపీని టార్గెట్ చేసిన టీడీపీ
పెట్రో ధరల విషయంలో ఇన్నాళ్లూ కేంద్రాన్ని వదిలిపెట్టి వైసీపీని టార్గెట్ చేసిన విపక్ష టీడీపీ.. ఇప్పుడు కేంద్రం ధరలు తగ్గించాక కూడా వైసీపీనే టార్గెట్ చేస్తోంది. కేంద్రం సూచన మేరక వైసీపీ సర్కార్ వ్యాట్ తగ్గించడం లేదని ఆరోపిస్తూ జిల్లాల్లో ధర్నాలకు దిగింది. అయితే ఇక్కడ పెట్రో ధరల విషయంలో నిర్ణయాలు కేంద్రం చేతుల్లోనే ఉన్నాయని తెలిసి కూడా బీజేపీని పల్లెత్తుమాట అనకుండా ఇన్నాళ్లూ మౌనంగా ఉండి వైసీపీని టార్గెట్ చేసిన టీడీపీ.. ఇప్పుడు కేంద్రం పెట్రో ధరలు తగ్గించాక కూడా వైసీపీని టార్గెట్ చేస్తుండటంతో ఆ పోరాటంలో పస లేదని తేలిపోయింది. ఎక్కడేం జరిగినా వైసీపీదే తప్పు అన్నట్లుగా టీడీపీ చేస్తున్న జిమ్మిక్కుగానే ఇది మిగిలిపోతోంది. దీంతో ఈసారి టీడీపీ నిరసనలకు విలువ లేకుండా పోతోంది.
బీజేపీపై నోరెత్తలేని చంద్రబాబు
గతంలో బీజేపీతో స్నేహం చేసి ఆ తర్వాత కాదనుకుని ధర్మపోరాటం కూడా చేసిన చంద్రబాబు చివరికి కాషాయ సేనను మరోసారి మచ్చికచేసుకునేందుకు రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో చంద్రబాబు ఏమాత్రం నిరుత్సాహపడకుండా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఇన్నాళ్లూ పెట్రో ధరలు వడ్డిస్తున్న కేంద్రాన్ని పల్లెత్తుమాట అనకుండా వైసీపీనే టార్గెట్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించిన నేపథ్యంలో గతంలో మాదిరిగానే వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆయన పోరాటంలో పస లేకుండా పోయింది. అలాగని బీజేపీని మెచ్చుకుని వైసీపీని టార్గెట్ చేస్తున్నారా అంటే అదీ లేదు. దీంతో చంద్రబాబు పెట్రో ధరల నిరసనలు తేలిపోతున్మాయి. ఇందులోనూ ఆయన వైసీపీనే టార్గెట్ చేస్తుండటంతో గతానికీ, ఇప్పటికీ తేడా ఏంటనే చర్చ మొదలైంది.
చంద్రబాబుకు ముందునుయ్యి, వెనుక గొయ్యు
ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్దితుల్లో బీజేపీని వైసీపీ టార్గెట్ చేయడం మొదలుపెట్టేసింది. బీజేపీ నేతలు చేస్తున్న చిన్నా చితకా విమర్శల్ని సైతం వైసీపీ కౌంటర్ చేస్తోంది. గతంలో ఇంతకంటే పెద్ద విమర్శలు చేసినా నోరు మెదపని వైసీపీ నేతలు ఇప్పుడు బీజేపీ చిన్నస్ధాయి నేతలు చేసే విమర్శల్ని కూడా పట్టించుకుని కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు అటు బీజేపీకి దగ్గరయ్యేందుకు వైసీపీని సీరియస్ గా విమర్శించలేక, అలాగని కేంద్రం తప్పిదాలకు వైసీపీని నిందించలేక సతమతం అవుతున్నారు. చివరికి అన్నింటికీ వైసీపీయే మూలమన్నట్లుగా చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలతో వాటి పస తగ్గిపోతోంది. దీంతో బీజేపీకి చంద్రబాబు దగ్గరయ్యేందుకు వైసీపీపై పోరు మినహా మరో మార్గం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.