జగన్ ఒడిశా టూర్-ఉత్తరాంధ్రలో భారీ వ్యూహం-అవే జరిగితే టీడీపీకి చుక్కలే..
ఏపీ సీఎం వైఎస్ జగన్ తాజాగా ఒడిశా వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ అయ్యారు. అసలే తాడేపల్లి క్యాంపు ఆఫీసు దాటి బయటికే రావడం లేదని విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో జగన్ ఏకంగా పొరుగు రాష్ట్రానికి వెళ్లి ముఖ్యమంత్రితో చర్చలు జరిపి వచ్చేయడం విశేషమే. అయితే ఈ విశేషం వెనుక భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్ని మార్చే భారీ వ్యూహం దాగుందనే విషయం ఎంతమందికి తెలుసు. ఇప్పుడు అదే అంశం ఉత్తరాంధ్రలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
జగన్ ఒడిశా పర్యటన
ఏపీ సీఎం వైఎస్ జగన్ నిన్న ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్లి సచివాలయంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. ఏపీ-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని కొటియా గ్రామాల సమస్యతో పాటు నేరడి బ్యారేజ్, జంఝావతి డ్యామ్ పైనా చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇరు ముఖ్యమంత్రుల పేరుతో ఓ సంయుక్త ప్రకటన వెలువడింది. ఇందులో ఆయా సమస్యలపై ఇరువురూ కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే ఈ సమస్యల పరిష్కారం కోసం సీఎస్ ల నేతృత్వంలో ఓ జాయింట్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో ఏపీ-ఒడిశా మధ్య సాగుతున్న దశాబ్దాల పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభించబోతోందన్న ఆశలు చిగురించాయి.
జగన్ ఒడిశా టూర్ పై చర్చ
వాస్తవానికి సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం దాటి ఓ రాష్ట్రం వెళ్లి రావడమంటే ఓ పెద్ద ప్రహసనమే. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి రావడం మినహా మరే రాష్ట్రానికీ వెళ్లింది లేదు. గతంలో తన ప్రమాణస్వీకారానికి వచ్చిన డీఎంకే అధినేత స్టాలిన్ ప్రమాణ స్వీకారానికి సైతం జగన్ వెళ్లలేదు. అలాంటిది ఉన్నట్లుండి ఒడిశా వెళ్లి సీఎం నవీన్ పట్నాయక్ ను జగన్ ఎందుకు కలిశారన్న దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఉత్తరాంధ్ర రాజకీయాలు కూడా తెరపైకి వచ్చేస్తున్నాయి. ఏదో ప్రయోజనం లేదంటే జగన్ ఒడిశా వెళ్లరనేది ఆ చర్చల అంతిమ సారాంశం.
ఉత్తరాంధ్రలో వైసీపీ
ఉత్తరాంధ్ర ప్రాంతం పరిధిలోకి వచ్చే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ గణనీయమైన విజయాలు అందుకుంది. విజయనగరం జిల్లాను అయితే పది పది స్ధానాలు గెల్చుకుని స్వీప్ చేసేసింది. అయితే కేవలం శ్రీకాకుళం ఎంపీ స్ధానంతో పాటు ఒకటీ అరా అసెంబ్లీ సీట్లు మాత్రమే టీడీపీకి దక్కాయి. కానీ ఆ తర్వాత జరిగిన పంచాయతీ, పరిషత్, మున్సిపల్ పోరులోనూ వైసీపీ హవా కొనసాగింది. ఇంత భారీ స్ధాయిలో విజయాలు దక్కించుకున్నా ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్ధితిపై జగన్ లో ఇంకా బెంగా పోలేదని తెలుస్తోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
ఉత్తరాంధ్రలో శాశ్వత పాగాపై దృష్టి
ఒకప్పుడు ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే వారు. వైఎస్ హయాంలో చూసినా, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో చూసినా టీడీపీ ఇక్కడ గణనీయమైన సీట్లు గెల్చుకునేది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడైతే ఇక చెప్పాల్సిన పనే లేదు. టీడీపీ హవా ఆ రేంజ్ లో కొనసాగేది. కానీ 2019లో రాష్ట్కవ్యాప్తంగా వీచిన పవనాలతో ఇక్కడ కూడా వైసీపీ భారీ విజయాలు అందుకుంది. కానీ ఈ విజయాలు శాశ్వతంగా ఉంటాయా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్ధితి వైసీపీది. దీంతో ఉత్తరాంధ్రలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించడం ద్వారా ఇక్కడ శాశ్వతంగా పాగా వేయొచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఒడిశాతో సమస్యల పరిష్కారంపై ముందుకు కదిలారు.
జగన్ టూర్ వెనుక భారీ వ్యూహం ?
జగన్ తాజాగా ఒడిశా పర్యటనలో భాగంగా ఏపీతో ఉన్న సరిహద్దు గ్రామాల సమస్యలతోపాటు ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే పలు కీలక అంశాలపై నవీన్ పట్నాయక్ తో చర్చించారు. ఇందులో కొటియా గ్రామాలతో పాటు నేరడి బ్యారేజ్, జంఝావతి డ్యాం, సరిహద్దు గ్రామాల స్కూళ్లలో తెలుగు, ఒడియా భాషల అమలు, పాఠ్యపుస్తకాల సరఫరా వంటి అంశాలు ఉన్నాయి. వీటిపై దీర్ఘకాలంగా వివాదాలు నెలకొనడం వల్ల సరిహద్దు గ్రామాలు నలిగిపోతున్నాయి. దీంతో అక్కడ ప్రభుత్వాలపై ప్రజల్లో నమ్మకం కూడా సడలిపోతోంది. దీంతో సరిహద్దు గ్రామాల నుంచి మావోయిస్టులు రిక్రూట్ మెంట్లు కూడా ఎక్కువగా చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఆయా వివాదాల్ని త్వరగా పరిష్కరించడం ద్వారా సరిహద్దుల్లో అభివృద్ధికి బాటలు వేయాలని జగన్ భావిస్తున్నారు. అదే సమయంలో ఒడిశా నుంచి వచ్చి ఏపీలో స్ధిరపడిన వారి ఓటు బ్యాంకును వైసీపీ వైపు తిప్పుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు. అదే జరిగితే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో టీడీపీ ప్రభావం కూడా గణనీయంగా తగ్గించవచ్చని జగన్ భావిస్తున్నారు.