నాతో పాటు నడవగలవా ? 3 కిలోమీటర్లూ రాలేవు- పవన్ కు జగన్ మంత్రి ధర్మాన సవాల్
ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా సాగే రాజకీయాల్లో వారిని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ను అధికార పార్టీ నేతలు, మంత్రులు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. వాటికి ఎప్పటికప్పుడు పవన్ కూడా ఘాటుగానే సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో తాజాగా వైసీపీ మంత్రి ధర్మాన పవన్ కళ్యాణ్ కు ఇవాళ ఓ సవాల్ విసిరారు.
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఓ సవాల్ విసిరారు. తనకు ఇప్పుడు 64 ఏళ్లని , పవన్ తనతో పాటు నడవగలరా? అని ధర్మాన సవాల్ విసిరారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని పవన్ గ్రహించాలని ధర్మాన ప్రసాదరావు ఆయనకు సూచించారు. "సినిమాలో బొమ్మలతో యాక్షన్ చేస్తారని, పవన్ నడుస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చేశారని అన్నారు. నాతో నడవమనండి... కనీసం 3 కిలోమీటర్లు కూడా నడవలేరన్నారు. మాటలు చెప్పినంత సులభంగా ఏమీ ప్రజాజీవితం ఉండదని ధర్మాన వ్యాఖ్యానించారు. తాను మాత్రం అధికారం, పదవులు పట్టించుకోకుండా నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నానని వెల్లడించారు.
Recommended Video
శ్రీకాకుళం జిల్లా లింగాలవలస గ్రామంలో వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు'గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. స్ధానికంగా ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ పోస్టర్ లో స్థానిక యువకుల ఫొటోలు కూడా ఉండడంపై మంత్రి ధర్మాన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ధర్మాన పవన్ కళ్యాణ్ కు ఈ సవాళ్లు విసిరారు. స్ధానికంగా ఉన్న యువత పవన్ కళ్యాణ్ కు ఆకర్షితులు కావడంపై ధర్మాన ఆగ్రహంతో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించాల్సి ఉంది.