కేసీఆర్ BRS ప్రకటనపై జగన్ మంత్రి రియాక్షన్- ఎవరొచ్చినా వైసీపీని ఏమీ చేయలేరంటూ..
తెలంగాణలో ఇప్పటిదాకా కొనసాగిన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ స్పందించారు. బీఆర్ఎస్ రాకతో ఏపీ రాజకీయాల్లో మార్పులు తప్పవన్న ప్రచారంపైనా జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన నేతలు వరుసగా స్పందిస్తున్నారు. ఇదే కోవలో వైసీపీ మంత్రి జోగి రమేష్ కూడా రియాక్ట్ అయ్యారు. ఏపీలో బీఆర్ఎస్ ప్రభావమేమీ ఉండబోదని జోగి తెలిపారు. దేశంలో చాలా మంది పార్టీలు పెట్టుకుంటూ ఉంటారని, వారి ఆలోచనలను బట్టి ఆయా పార్టీల నిర్ణయాలు ఉంటాయన్నారు. ఏపీలో వైసీపీకి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, మరో 20 ఏళ్ల దాకా జగనే ఏపీ సీఎంగా కొనసాగుతారని మంత్రి జోగి రమేష్ వెల్లడించారు.
మరోవైపు తెలంగాణ మంత్రులు ఏపీ గురించి చేస్తున్న వ్యాఖ్యలపైనా జోగి రమేష్ స్పందించారు. సీఎం జగన్ గురించో, ఏపీ గురించో మాట్లాడితే కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయొచ్చని కొందరు తెలంగాణ మంత్రులు భావిస్తున్నారని జోగి రమేశ్ విమర్శించారు. అందుకే తెలంగాణ మంత్రులు అప్పుడప్పుడు విమర్శలు గుప్పిస్తూ ఉంటారన్నారు. బీఆర్ఎస్సే కాదు ఏ పార్టీ వచ్చినా వైసీపీని ఏమీ చేయలేవన్నారు. ఆ మాట కొస్తే వైసీపీ ఎవరికీ భయపడే పార్టీ కాదన్నారు. ఏపీలో ప్రజలంతా తమ వైపే ఉన్నారన్నారు. వైసీపీ చేపట్టినన్ని సంక్షేమ పథకాలు మరే పార్టీ ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదని జోగి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీనే విజయం సాధిస్తుందన్నారు.