కుప్పం నుంచే మొదలు, బస్సు యాత్ర అక్కడి నుంచే: జగన్
చిత్తూరు : తన ప్రజా సంకల్ప యాత్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యం చేసుకుని విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు.
తమ పార్టీ గెలుపు కుప్పం నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలని ఆయన అన్నారు. కుప్పం చంద్రబాబు సొంత నియోజకవర్గమనే విషయం తెలిసిందే. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన గురువారం పెద్దూరులో తనను కలిసి మద్దతు తెలిపిన ప్రజలతో మాట్లాడారు.

బీసీలు ఇక్కడే ఎక్కువ..
చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే అత్యధికంగా బీసీలు ఉన్నారని అంటూ వారందరికీ చంద్రబాబు ఏం చేశారని వైయస్ జగన్ ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తేనే బీసీలకు మేలు జరుగుతుందన్నారు.

కుప్పం నుంచే ప్రారంభం కావాలి..
వైయస్సార్ కాాంగ్రెసు విజయం కుప్పం నుంచే ప్రారంభం కావాలని, కుప్పం పార్టీ సమన్వయకర్త చంద్రమౌళికి ఓటు వేసి గెలిపిస్తే కేబినెట్లో కూర్చోబెట్టి చంద్రబాబు కన్నా మెరుగ్గా అభివృద్ధి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.

మా నవరత్నాలతో...
తమ పార్టీ నవరత్నాలు పేదల జీవితాల్లో వెలుగు నింపుతాయని జగన్ అన్నారు. పాదయాత్ర అనంతరం సెప్టెంబర్లో బస్సుయాత్ర మొదలు అవుతుందని, ఆ సందర్భంగా కుప్పం వచ్చి ప్రతి మండలంలోనూ పర్యటిస్తానని ఆయన తెలిపారు.

చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న జగన్ యాత్ర
వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. తన యాత్రలో ఆయన చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తుతూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications