అక్కడి నుంచే పార్టీ బలోపేతం: కార్యకర్తలకే టాప్ ప్రయారిటీ: జగన్ నిర్ణయం
YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తన సొంత నియోజకవర్గానికి బయలుదేరి వెళ్లనున్నారు. రెండు రోజులపాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పులివెందులకు వెళ్లడం ఇదే తొలిసారి.
ఇడుపులపాయకు..
మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కడపకు బయలుదేరుతారు. అక్కడి నుంచి రోడ్డు హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకుంటారు. వైఎస్సార్ ఘాట్ను సందర్శిస్తారు. తండ్రి సమాధికి నివాళి అర్పిస్తారు. అనంతరం పులివెందులలో పర్యటిస్తారు. మొన్నటి ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలను తెలియజేస్తారు.

సీమ నేతలతో భేటీ..
ఇడుపులపాయలో రాయలసీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు జగన్. కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులు ఆయనను కలుసుకుంటారు.
ఓటమిపై ఆరా..
మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ మూడు నియోజకవర్గాలకు పరిమితమైన విషయం తెలిసిందే. పులివెందుల, బద్వేలు, రాజంపేటల్లో మాత్రమే గెలిచింది. మిగిలిన చోట్ల భారీ మెజారిటీతో ఓడిపోయింది. ఈ ఓటమికి గల కారణాలను జగన్ ఆరా తీయనున్నారు. సొంత నియోజకవర్గం, సొంత జిల్లా నుంచే పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయాలను తీసుకోనున్నారు.

21న రాక..
పులివెందుల పర్యటనను ముగించుకుని ఈ నెల 21వ తేదీ సాయంత్రం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. ఆ మరుసటి రోజున పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన విస్తృతస్థాయి సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఈ నెల 19వ తేదీన ఈ భేటీ జరగాల్సి ఉంది. ఇది- 22వ తేదీకి వాయిదా పడింది.
కూటమిపై ఎదురుదాడికి..
ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవడం, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలనే విషయంపై చర్చించడం, పార్టీ క్యాడర్పై దాడులు, చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వంపై ఎలా ఎదురుదాడికి దిగాల్సి ఉంటుందనే విషయంపై అవసరమైన సూచనలు, సలహాలను పార్టీ నాయకుల నుంచి స్వీకరించడానికి ఏర్పాటైన విస్తృతస్థాయి సమావేశం ఇది.












Click it and Unblock the Notifications