వైఎస్ జగన్ ఎన్డీఏలో చేరాలి: కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు, 3 రాజధానులపైనా..
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని వ్యాఖ్యానించారు. ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు మంచి మిత్రుడని వ్యాఖ్యానించిన కేంద్రమంత్రి అథవాలే.. ఆయన ఎన్డీఏలో చేరాలని కోరారు.
ఎన్డీయేలో చేరితే హైవేలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఏపీకి మేలు జరుగుతుందని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందన్న కేంద్రమంత్రి అథవాలే.. అయితే ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు పార్లమెంటరీ కమిటీని సిఫార్సు చేశామని తెలిపారు.
మరో 15 ఏళ్లవరకు కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం లేదని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే వ్యాఖ్యానించారు. పీవోకే.. భారత్లో అంతర్భాగమేనని అన్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పీవోకే వదిలివెళ్లాలన్నారు. పీవోకే వీడితేనే భారత్-పాకిస్థాన్ మధ్య స్నేహం కొనసాగుతుందని కేంద్రమంత్రి అథవాలే స్పష్టం చేశారు.
ఇది ఇలావుంటే, ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికార వైసీపీకి దమ్ముంటే రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా? అంటూ నిలదీశారు సోమువీర్రాజు. బద్వేలు బస్తీ అవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెబితే.. కనీసం బద్వేలుకు పంట కాలవలు కూడా నిర్మాణం కాలేదన్నారు.
బ్రహ్మంసాగర్కు అనుబంధంగా కాలవల నిర్మాణం జరగలేదన్న సోము.. బ్రహ్మంగారి కాలజ్ఞానం కాలరాసేవారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజ్యమేలుతున్నారని సోము వీర్రాజు విమర్శించారు. ఈ విషయాన్ని బద్వేలు ప్రజలు గుర్తించారని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. పులివెందులకు బద్వేలుకు మధ్య అభివృద్ధిలోని వ్యత్యాసాన్ని బద్వేలు ప్రజలేకాదు, రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని సోము వీర్రాజు అన్నారు.
Recommended Video
బద్వేలుకు ఏమైనా మంచి జరిగిందంటే, అది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో మాత్రమే అభివృద్ధి సాగిందని సోము వీర్రాజు చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ కరెంటు కోతలు మాదిరిగా సంక్షేమ పథకాలకు కోతలు విధిస్తోందని విమర్శించారు. అందుకే అమ్మఒడికి అటెండెన్స్ లింక్ పెట్టిందని సోము వీర్రాజు తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణం దగ్గర నుంచి రేషన్ బియ్యం వరకూ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని ఈ విషయాన్ని వైసీపీ సర్కారు ప్రజలకు తెలియకుండా చేస్తోందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.