'కత్తి తీసుకెళ్లిన వ్యక్తి బొత్స బంధువే, జగన్ కథ అడ్డం తిరిగింది, రోజా డైరెక్షన్లో మరోసారి ప్రయత్నం'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతల మాటల దాడి కొనసాగుతోంది. టీడీపీ నేతలు వర్ల రామయ్య, కొనకళ్ల నారాయణ, కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనంద్ బాబు, కళా వెంకట్రావు, చినరాజప్ప తదితరులు మండిపడ్డారు.
జగన్పై విమానాశ్రయంలో దాడి ఓ నాటకం అన్నారు. జగన్తో కలిసి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. కేంద్రం వైఖరితో పాటు జగన్ వ్యవహారశైలి సరిగా లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో సానుభూతి ఓట్ల కోసం జగన్ ఆడిన కత్తి డ్రామా విఫలమైనందుకు బాధపడవద్దని, నగరి ఎమ్మెల్యే, నటి రోజా దర్శకత్వంలో మరోసారి ప్రయత్నించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ అన్నారు.
ఆ చివరి పేజీ హడావిడిగా రాశారు, తీగలాగుతున్నాం!: జగన్పై దాడి చేసిన వ్యక్తిపై విశాఖ సీపీ
జగన్ కోడి కత్తి కథ అడ్డం తిరిగింది
జగన్ కోడి కత్తి కథ అడ్డం తిరిగిందని, ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదంటే జగన్ 300 రోజులు 3,200 కి.మీ.కు పైగా పాదయాత్ర చేసేవాడివా అని వర్ల రామయ్య ప్రశ్నించారు. వెంటనే పోలీసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కత్తితో పొడిచినవాడు సానుభూతిపరుడైతే, గాయపడినవారు పార్టీ నాయకుడని నాటకంలో బట్టబయలైందన్నారు.
హత్యాయత్నం నాటకం
ప్రజల్లో సానుభూతి పెంచుకునేందుకు జగన్ హత్యాయత్నం నాటకం ఆడారని ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలున్నాయని గవర్నర్ ద్వారా సిఫారసు చేయించి రాష్ట్రపతి పాలన పెట్టించాలని ప్రయత్నిస్తున్నారు. హత్యా రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు.
వీరంతా కుట్రలో భాగస్వాములు
కేంద్రం దర్శకత్వంలోనే జగన్పై దాడి జరిగిందని, ఈ నాటకంలో జగన్ పాత్రధారి అయితే కేంద్రం సూత్రధారి అని కాల్వ శ్రీనివాసులు అన్నారు. విశాఖ విమానాశ్రయంలో జగన్కు కోడి కత్తి గుచ్చుకుంటే ఆయన అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ విమానమెక్కి హైదరాబాదు వెళ్లిపోయేందుకు ఎయిర్ పోర్టు అథారిటీ సహకరించిందన్నారు. జగన్ భుజానికి కత్తి మొన తగిలిందో లేదో హస్తినలో ఉన్న గవర్నర్ డీజీపీకి ఫోన్ చేశారని, పవన్ కళ్యాణ్ ఖండించారని, కేసీఆర్తోపాటు కేటీఆర్, కవిత ఖండించారని, జీవీఎల్ న్యాయ విచారణకు డిమాండ్ చేశారని, కుట్రలో వీరంతా భాగస్వాములని అర్థమవుతోందన్నారు.
కత్తితో తీసుకెళ్లిన చిన్న శ్రీని వైసీపీ నేత బొత్స బంధువు
జగన్ పైన దాడి పరిణామం కుట్రపూరితంగా, పలు అనుమానాలకు తావిచ్చేలా ఉందని నక్కా ఆనందబాబు అన్నారు. కత్తి తీసుకెళ్లిన చిన్న శ్రీను వైసీపీ నేత బొత్స సత్యనారాయణ బంధువు అని, జగన్ రాష్ట్రంలో ఉండే వైద్యుల వద్ద వైద్యంచేయించుకోరని, ఏపీ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వరని, వాళ్లపై నమ్మకం లేదని, అలాంటి జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కావాలని ఎలా కోరుకుంటారని ప్రశ్నించారు. ఇది చాలా విడ్డూరమన్నారు.
గాయమైన వ్యక్తి విమానంలో ఎలా వెళ్లారు
ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని ఫాసిస్ట్ మనస్తత్వం ఉన్న వ్యక్తితో కలిసి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిపరిచేందుకు కుట్ర పన్నుతోందని, తీసుకు వెళ్లరాని చిన్నవస్తువు ఉంటే విమానం వెళ్లిపోతున్నా పోనివ్వరని, ఇక్కడ మాత్రం చిన్నపాటి గాయమైన వ్యక్తి నేరుగా విమానంలో హైదరాబాదుకు ఎలా వెళ్లారని, జగన్కు ఏపీ పోలీసులు, వైద్యులు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు.
అందుకే ఎన్టీఆర్ గృహం మంజూరు
కేంద్రం ఆధీనంలో ఉన్న సంస్థలో ఘటన జరిగితే మమ్మల్ని ఎలా తప్పుపడతారని, ప్రజాప్రతినిధిపై దాడి ఎలా జరిగిందని, ఎందుకు జరిగిందనేది విచారిస్తున్నామని, తాను జగన్ అభిమానినేనని, ఆయన సీఎం అయ్యేందుకు సానుభూతి రావాలనే ఈ చర్యకు పాల్పడ్డానని నిందితుడు చెప్పాడని, వాస్తవాన్ని పక్కన పెట్టి సీఎంను ఏ1గా, హోం మంత్రి, డీజీపీలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేయడంలో అర్థం లేదని చినరాజప్ప అన్నారు. ఘటనపై జగన్ కానీ, ఆసుపత్రి వర్గాలుగానీ ఫిర్యాదు చేయకపోవడం, రాష్ట్ర పోలీసులు వెళ్తే సహకరించకపోవడం ఎంతమాత్రం సరికాదన్నారు. పేదలకు అన్ని పథకాలు అందాలనే ఉద్దేశంతోనే రాజకీయాలకు అతీతంగా వైసీపీ అభిమాని అయినా నిందితుడి కుటుంబానికి ఎన్టీఆర్ గృహాన్ని మంజూరు చేశామన్నారు.
పరిటాల రవి హత్యను లాగిన సునీత
జగన్కు చిన్న గాయమైతేనే పోలీసు వ్యవస్థ విఫలమైందంటోన్న నాయకులకు, వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పరిటాల రవి పోలీస్స్టేషన్ సమీపంలోనే హత్యకు గురైనపుడు వారికి పోలీసుల వైఫల్యం కనిపించలేదా అని మంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. అప్పుడు తన భర్త హత్య గురించి మాట్లాడిన వారే కరవయ్యారన్నారు. అప్పటి గవర్నర్, నాయకులు ఒక్కరూ కనీసం పలకరించలేదన్నారు. కేవలం చంద్రబాబే తమ కుటుంబానికి అండగా నిలిచారన్నారు. తన భర్తను పట్టపగలే హత్య చేయించారన్నారు. చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలు తగదన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి కూడా అలా ఆరోపించలేదు
జగన్ హత్యకు టీడీపీ కుట్ర పన్నిందని, వచ్చే ఎన్నికల్లో తమకు ఎదురులేకుండా ఉండేందుకే దాడి చేయించిందనీ వైసీపీ నేతలు ఆరోపించడం సరికాదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్పై దాడి వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ1, డీజీపీ ఏ2 అంటూ మాట్లాడటం నీచమన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలకు వెళుతున్న ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతను హత్య చేయించాలని అనుకుంటారా అని ప్రశ్నించారు. వైయస్ ఎప్పుడైనా చంద్రబాబుని లేదా చంద్రబాబు ఎప్పుడైనా వైయస్ని గొంతు కోసి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారా అని నిలదీశారు. ప్రపంచంలో ఎవరైనా అలా ఆలోచిస్తారా అన్నారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డిపై హైదరాబాద్లో ఒకరు కత్తితో దాడి చేసినప్పుడు కూడా టీడీపీనే ఆ పని చేయించిందని ఆయన ఆరోపించలేదని చెప్పారు.