కేసీఆర్ మాటలు ఇంకా గుర్తున్నాయి.., బాబు ఏదైనా బావిలో దూకు, ఇక అందరికీ తెలిసిపోయింది: జగన్
తెనాలి: ప్రత్యేక హోదా పోరు ఉధృతమవుతున్న తరుణంలో.. టీడీపీ-వైసీపీల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. సహజంగానే దూకుడుగా వ్యవహరించే వైసీపీ అధినేత జగన్ మరింత దూకుడు పెంచారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా.. సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలిలోని సంగం జాగర్లమూడి వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. మరోసారి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
ఆల్పార్టీ మీటింగ్తో బాబు డ్రామాలు, ఏడు ప్రశ్నలు, పవన్ ఏం చేశాడు:జగన్
బాబు ఒక '420':
'సీఎం చంద్రబాబు పుట్టింది నాలుగో నెల.. 20వ తేదీ. అంటే ఆయనో 420. హిట్లర్ కూడా అదే తేదీన పుట్టారు. చంద్రబాబు, హిట్లర్ ఇంచుమించు ఇద్దరి మనస్థత్వాలు ఒకటే. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి.. అదే నిజం అని నమ్మించడానికి గోబెల్స్ ప్రచారాలు చేస్తుంటారు. అందుకు మీడియాను వాడుకుంటారు' అని జగన్ ఆరోపించారు.
చంద్రబాబు ఏదైనా బావి చూసుకుని దూకితే... రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవని పార్టీలు, నేతలు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవని పార్టీలు, నేతలు అంటూ ఎవరూ లేరని, అందుకే ఆయన్ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని అన్నారు.
అందరికీ తెలిసిపోయింది..
నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మొట్ట మొదటిసారి అవిశ్వాస తీర్మానం పెట్టింది వైసీపీనే. చరిత్రలో నిలిచిపోయే ఘటన ఇది. ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారు. పోనీ ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందనుకుంటే మళ్లీ చిత్తశుద్ధి కరువైంది.
చంద్రబాబు ఎంతస్థాయిలో మోసగాడనేది రాష్ట్రంలో, దేశంలో అందరికీ తెలిసిపోయింది. రాజకీయాలకు కాస్త విశ్వసనీయత అవసరం. ఆయనకు వెన్నుపోటు తెలుసు. ఆయన నైజం కూడా అదే. ఢిల్లీలో కూడా అలానే చేశారు. ఇలాంటి ఆయన అఖిలపక్షానికి పిలిస్తే వెళ్లాలా?.. అంటూ జగన్ మండిపడ్డారు.
నా స్టాండ్ ఒకటే:
ఎంపీల రాజీనామా ఆఖరి అస్త్రం అని గతంలో చెప్పాను.. ఇప్పుడు అదే స్టాండ్ కు కట్టుబడి ఉన్నాను. ఆఖరి బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాక కూడా.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాజీనామాలు చేస్తాం?.. చంద్రబాబు కూడా తమ ఎంపీలతో రాజీనామా చేయించి ఉంటే జాతీయ స్థాయిలో దీనిపై మరింత చర్చ జరిగేది. తన అవినీతిపై కేంద్రం విచారణ జరిపిస్తుందన్న భయంతోనే చంద్రబాబు రాజీనామాలకు ఒప్పుకోవట్లేదని ఆరోపించారు.
కేసీఆర్ మాటలు ఇంకా గుర్తున్నాయి..:
'నా తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దాడుతా' అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తనకు ఇంకా గుర్తున్నాయని, ఆ మాట అన్న ఆయన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని, అలాంటి పోరాటం హోదా కోసం మన చేస్తే ఎందుకు సాధించుకోలేము?' అని జగన్ ప్రశ్నించారు.
- ఇదే క్రమంలో చంద్రబాబుకు ఆయన ఏడు ప్రశ్నలు సంధించారు.
- ప్లానింగ్ కమిషన్కు కనీసం ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేదు?
- ప్యాకేజీని స్వాగతించింది నిజం కాదా?
- వృద్ధి రేటుపై తప్పుడు సంకేతాలివ్వలేదా?
- వైస్సార్సీపీ పోరాటాన్ని నీరుగార్చ లేదా?
- అవిశ్వాసంపై యూటర్న్ నిజం కాదా?
- నల్ల బ్యాడ్జీలతో హోదా వస్తుందా?
- ఎంపీలతో రాజీనామా చేయించక పోవడం మోసం కాదా? అని జగన్ నిలదీశారు.