చంద్రబాబుకు కౌంటర్: ఫలించిన వైఎస్ జగన్ వ్యూహం
హైదరాబాద్: శాసనసభ్యుల ఫిరాయింపులను ఆపడానికి చంద్రబాబు వ్యూహానికి ప్రతివ్యూహం రచించి అమలు చేయడంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించినట్లే కనిపిస్తున్నారు. చివరగా కలమట వెంకటరమణ టిడిపిలో చేరడంతో ఆ ఫిరాయింపులు తాత్కాలికంగానైనా ఆగిపోయినట్లేనని భావిస్తున్నారు.
తన పార్టీ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకుంటుండడంతో అప్రమత్తమైన జగన్మోహన్ రెడ్డి రాజధాని భూముల బినామీ కొనుగోళ్ళ వ్యవహారాన్ని బయటపెట్టారు. అదే సమయంలో కాపు నాయకుడు ముద్రగడ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా తెర మీదికి వచ్చారు. ఈ రెండు వ్యవహారాలతో ఫిరాయింపులకు తెర పడిందని భావిస్తున్నారు.
ముద్రగడ పద్మనాభం ప్రభుత్వానికి మార్చి 10వరకు గడువు విధించారు. అంటే ఇంకా ఆరు రోజుల వ్యవధి ఉంది. ఈలోగా ఎవరూ పార్టీ వీడకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై ఏదోవిధంగా ఇంకా ఒత్తిడి పెంచవచ్చే అవకాశాలున్నాయి. ఈలోగా అమరావతి ప్రాంతంలో బినామీ పేర్లతో భూములు కొన్న మరికొంత మంది టిడిపి నేతల పేర్లను సాక్షి మీడియా బయటపెట్టినా ఆశ్చర్యం లేదు.
శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలవుతాయి. దాంతో శాసనసభా సమావేశాల్లో అమరావతి భూదందాను ప్రధానం చేసుకుని జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై దాడికి దిగే అవకాశం ఉంది. టిడిపి ప్రభుత్వం కేవలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండే కాకుండా మిత్రపక్షమైన బీజేపీతో కూడా చాలా ఇబ్బంది పడుతోంది. ఈ స్థితిలో ఆపరేషన్ ఆకర్ష్పై టిడిపి దృష్టి పెట్టే అవకాశం తగ్గిపోతుందని భావిస్తున్నారు.