చిరంజీవి అస్త్రం సక్సెస్-టాలీవుడ్ నోర్మూయించిన జగన్-పరిష్కారం తర్వాత
ఏపీలో సినిమా టికెట్ల ధరల నియంత్రణపై టాలీవుడ్ కూ, వైసీపీ ప్రభుత్వానికీ నెలకొన్న వివాదానికి సీఎం జగన్ తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. నిత్యం ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై టాలీవుడ్ నుంచి ఎవరో ఒకరు మాట్లాడుతూ, సూటిగా విమర్శలు చేస్తూ ఇరుకునపెడుతున్న నేపథ్యంలో టాలీవుడ్ ను కట్టడి చేసే విషయంలో జగన్ వేసిన ప్లాన్ సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని తాడేపల్లి పిలిపించుకుని మాట్లాడిన జగన్.. ఆ మేరకు టాలీవుడ్ కు హెచ్చరికలు పంపారు.
సినిమా టికెట్ల రచ్చ
ఏపీలో సినిమా టికెట్ల వివాదాన్ని తెరపైకి తెచ్చిన వైసీపీకి అది ఎంత తలనొప్పో తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే క్రమంలో సినిమా టికెట్ల ధరల వ్యవహారం తన చేతుల్లో ఉండాలని భావించిన వైసీపీ ప్రభుత్వం.. ఇదే క్రమంలో సినిమాటోగ్రఫీ చట్టంలో సైతం సవరణలు చేస్తూ జీవో 35 ఇచ్చేసింది. అయితే హైకోర్టులో తొలిసారి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత అప్పీలుకు వెళ్లిన ప్రభుత్వానికి కమిటీ వేయాలంటూ హైకోర్టు చేసిన సూచన అమలు చేయక తప్పలేదు. దీంతో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం టికెట్ ధరలపై తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్దమవుతోంది.
హీరోల కామెంట్స్ చిచ్చు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు నియంత్రించడంపై టాలీవుడ్ వైపు నుంచి ప్రశ్నించే పెద్దలు లేకపోవడంతో హీరోలు నాని, సిద్ధార్ద్ దూకుడు మొదలుపెట్టారు. తమ సినిమాల ప్రమోషన్ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం ప్రారంభించారు. ఇది అంతిమంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది. సినిమా హీరోలు చేసే వ్యాఖ్యలు జనంలోకి సులువుగా వెళ్లే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. చివరికి సీఎం జగన్ నేరుగా జోక్యం చేసుకున్నారు.
చిరును పిలిపించి మాట్లాడిన జగన్
టాలీవుడ్ నుంచి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారిని కట్టడి చేసేందుకు హీరో చిరంజీవిని పిలిపించుకున్న సీఎం జగన్ ఆయనకు తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పేశారు. సినిమా టికెట్ల ధరల వ్యవహారం తాను చూసుకుంటానని, మీరు మాత్రం టాలీవుడ్ హీరోల్ని కట్టడి చేయాలని సూచించారు. దీంతో జగన్ తో భేటీ తర్వాత బయటికి వచ్చిన చిరంజీవి... సినిమా టికెట్ల వ్యవహారం తర్వలో సద్దుమణుగుతుందని, అంతవరకూ టాలీవుడ్ నుంచి ఎవరూ అనవసరంగా మాట్లాడొద్దని సూచించారు. తద్వారా టాలీవుడ్ నుంచి వైసీపీ ప్రభుత్వంపై రెచ్చిపోతున్న హీరోల్ని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు.
జగన్ ప్లాన్ సక్సెస్
చిరంజీవిని పిలిపించి మాట్లాడటం ద్పారా జగన్ తన ప్లాన్ ను విజయవంతంగా అమలు చేసినట్లయింది. సినిమా టికెట్ల వ్యవహారంపై వైసీపీ సర్కార్ వెంటనే వెనక్కి తగ్గకపోయినా టాలీవుడ్ ను మాత్రం వెంటనే కట్టడి చేసేందుకు చిరంజీవి టూర్ ఉపయోగపడినట్లయింది. అన్నింటికీ మించి జగన్ సూచించినట్లుగా చిరంజీవి.. టాలీవుడ్ హీరోలకు చిరంజీవి చేసిన సూచన కూడా పనికొచ్చినట్లే కనిపిస్తోంది.
ఈ భేటీ తర్వాత టాలీవుడ్ నుంచి ఒక్క వర్మ మినహా మిగతా వారెవరకూ మాట్లాడటం లేదు. ఓ దశలో సామాజిక వర్గాల వరకూ వచ్చేసిన విమర్శల దాడికి జగన్ ఆ విధంగా ఫుల్ స్టాప్ పెట్టగలిగారు. ఈ వ్యవహారంతో చిరంజీవిని పరోక్షంగా టాలీవుడ్ పెద్దగా జగన్ గుర్తించినట్లయిందన్న భావన కూడా సర్వత్రా వ్యక్తమవుతోంది.