సచివాలయ ఉద్యోగుల పరీక్షలపై ఉత్కంఠ-తప్పనిసరి కానుందా-జగన్ ఫైనల్ కాల్
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. వీరిని ఉద్యోగాల్లో తీసుకున్నప్పుడు రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో రూ15 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, ఆ తర్వాత వారి ప్రతిభ ఆధారంగా శాశ్వత పోస్టింగ్ ఇవ్వాలని నిబంధనలు పెట్టారు. వీటి ప్రకారం ఇప్పుడు రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టగా.. వీటిని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం జటిలంగా మారనుంది.

సచివాలయ పరీక్షలపై టెన్షన్
ఏపీలో దాదాపు 15 వేలకు పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 27 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని రెండేళ్ల క్రితం పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల్లోకి తీసుకున్న ప్రభుత్వం... 15 వేల రూపాయల ప్రొబేషనరీ వేతనం ఇస్తోంది. ఇప్పుడు రెండేళ్లు పూర్తి కావడంతో వీరికి మరోసారి ఆన్ లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించి వాటిలో ప్రతిభ ఆధారంగా శాశ్వత పోస్టింగ్ లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే వీటిపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనతో వారు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఉద్యోగుల్లో వ్యతిరేకత
రెండేళ్ల క్రితం పరీక్షలు రాసి ఉద్యోగాల్లో చేరిన తమకు మరోసారి పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణత ఆధారంగానే పోస్చింగ్స్ ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగుల్లో చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, తమకు బేషరతుగా పోస్టింగ్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో తాము ఉత్తీర్ణులు కాకపోతే తమ పరిస్ధితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.

ఉద్యోగాలేం పోవంటున్న సజ్జల
సచివాలయ ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించి వాటిలో ఉత్తీర్ణత ఆధారంగా శాశ్వత పోస్టింగ్స్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం సమర్ధించుకుంటోంది. ఐఏఎస్ అధికారులకే పోస్టింగ్స్ కోసం పరీక్షలు నిర్వహిస్తారని, అలాంటిది సచివాలయ ఉద్యోగులకు నిర్వహిస్తే తప్పేంటని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు సహజమేనని, వీటిలో ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన సరికాదన్నారు.

నేడు జగన్ తుది నిర్ణయం
సచివాలయ ఉద్యోగులకు శాశ్వత పోస్టింగ్స్ ఇచ్చేందుకు నిర్వహించే శాఖాపరమైన పరీక్షలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇవాళ సీఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. సచివాలయ ఉద్యోగులకు నిర్వహించే పరీక్షలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఉద్యోగుల్లో ఆందోళనకు కారణాలు తెలుసుకుని, వాటిని తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించనున్నారు. ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనల దృష్ట్యా పరీక్ష విధానంతో పాటు ఇతర మార్పులపైనా అధికారులకు జగన్ సూచనలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications