ఇక ఢిల్లీ కేంద్రంగా జగన్ పావులు: మకాం అక్కడే
YS Jagan Mohan Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న దాడులు, హత్యలు, అత్యాచారాలపై దేశ రాజధానిలో ఉద్యమించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమౌతోంది.
50 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కేంద్రానికి వివరించాలని, ఈ పోరాటానికి కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొంటామంటూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం ఢిల్లీలో నిర్వహించే ధర్నాలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులంతా పాల్గొనబోతోన్నారు.

ఈ నేపథ్యంలో- వైఎస్ జగన్.. ఇంకాసేపట్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయన వెంట ఢిల్లీ వెళ్తారు. రేపు ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనను నిర్వహించనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో చోటు చేసుకుంటూ వచ్చిన అన్ని అంశాలనూ ఈ ధర్నా సందర్భంగా ప్రస్తావనకు తీసుకుని రానున్నారు జగన్. హత్యలు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులపై దాడులు, వారి ఇళ్లను కూల్చివేయడం వంటి ఘటనపై ఫొటో ఎగ్జిబిషన్ సైతం ఏర్పాటు చేశారు.
దీని తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారి అపాయింట్మెంట్ లభించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న అవాంఛనీయ పరిస్థితులతో కూడిన వినతిపత్రాన్ని అందజేయనున్నారు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని జగన్ వారికి వివరించనున్నారు. రాష్ట్రపతి పాలనను విధించాల్సిన అవసరం ఉందంటూ ఇదివరకే ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ డిమాండ్తోనే తాము ఢిల్లీలో ఉద్యమిస్తానంటూ ఇదివరకే వెల్లడించారు.












Click it and Unblock the Notifications