అసెంబ్లీకి రాని నెహ్రూ: జగన్ ప్రయత్నించినా..., సాయితో రాయబారం
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా నుంచి జ్యోతుల నెహ్రూతో పాటు మరో ముగ్గురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిశ్చయించుకోవడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో సంక్షోభం తలెత్తింది. దీన్ని నివారించడానికి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
తమ పార్టీకి చెందిన ఎమ్మ్లెల్యేలు జ్యోతుల నెహ్రూ,వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరిలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ స్థితిలో జ్యోతుల నెహ్రూని కలిసేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
నెహ్రూను కలిసేందుకు జగన్ రాయబారం నడుపుతున్నారు. నెహ్రూను కలపాల్సిన బాధ్యత విజయసాయిరెడ్డికి జగన్ అప్పగించారు. అయితే, శనివారంనాడు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ , వరుపుల సుబ్బారావు హాజరుకాలేదు.
ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవి అంశం జ్యోతుల నెహ్రూలో తీవ్ర అసంతృప్తికి దారి తీసిన సంగతి తెలిసిందే. సీనియర్ ఎమ్మెల్యేగా ఈ పదవిని ఆశించినప్పటికీ, ఇతర సీనియర్లూ మద్దతు పలికినప్పటికీ, దాన్న్ి జగన్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బుగ్గన రాజేంద్రనాథ రెడ్డికి అప్పగించారు.
ఈ నిర్ణయంతో జ్యోతుల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో టిడిపి ప్రముఖులు జ్యోతుల నెహ్రూను సంప్రదించి తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. తన వద్దకు వచ్చిన అంబటి రాంబాబు వద్ద తన అసంతృప్తిని జ్యోతుల నెహ్రూ వెల్లడించినట్లు తెలుస్తోంది.