అదే తుపాన్..! జగన్, షర్మిల రియాక్షన్స్ లో ఎంత తేడా ?
ఏపీలో మూడు రోజుల పాటు ప్రభావం చూపిన మొంథా తుపాను ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. దీంతో తుపాను నష్టం అంచనాల్లో ప్రభుత్వ యంత్రాంగం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తుపాను రాజకీయాలు మొదలయ్యాయి. మఖ్యంగా తుపాను సహాయ చర్యలు, బాధితులకు అందించే సాయం విషయంలో విపక్ష పార్టీలైన వైసీపీ, కాంగ్రెస్ ఇవాళ స్పందించాయి. జగన్ తమ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు ఇవ్వగా.. షర్మిల నేరుగానే విమర్శలకు దిగారు.
మొంథా తుపాన్ సహాయక చర్యలు, రైతుల్ని ఆదుకోవడంపై ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కీలక నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. తుపాను నష్టం అంచనా వేయడంతో పాటు రైతుల్ని ఆదుకునే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఆయన వైసీపీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేశారు. తమ ప్రభుత్వం ఉంటే రైతుల్ని ఆదుకునేదన్నారు. అదే సమయంలో ప్రభుత్వ తీరుపై జగన్ విమర్శలు కూడా గుప్పించారు. ఇందులో కేంద్రం గురించి మాత్రం స్పందించలేదు.

మరోవైపు పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మాత్రం కేంద్రంలో బీజేపీని ప్రధానంగా టార్గెట్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తరాదిన ప్రకృతి విలయాలకు వెంటనే జాతీయ విపత్తులుగా ప్రకటించుకునే ప్రధాని మోడీ .. రాష్ట్రంపై మాత్రం మళ్లీ సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని ఆరోపించారు. తుఫాను ధాటికి జనజీవనం అల్లకల్లోలం అయితే తమకేం పట్టనట్లు చోద్యం చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల మద్దతుతో మూడో సారి గద్దెనెక్కిన మోడీ ..ఆపద సమయంలో మొహం చాటేసి మరోసారి తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా నీట మునిగాయని, ఖరీఫ్ సీజన్ లో సాగైన పంటల్లో 30 శాతం పనికి రాకుండా పోయాయని, 10 లక్షల మంది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని షర్మిల ఆరోపించారు. ఇది రాష్ట్ర రైతాంగానికి సంభవించిన మహా విపత్తు అన్నారు. రూ.20వేల కోట్లకు పైగానే రైతులకు జరిగిన అపార నష్టం ఇది అన్నారు.కాబట్టి వెంటనే మొంథా తుఫాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. ప్రళయం మిగిల్చిన నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలను రాష్ట్రానికి పంపాలన్నారు. అంచనా నివేదికలొచ్చే లోపు రాష్ట్రానికి తక్షణ సహాయం కింద రూ.10 వేల కోట్లు సాయం ప్రకటించాలన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు కేవలం 2.88 లక్షల ఎకరాల్లోనే నష్టం జరిగినట్లు తక్కువ చేయడం భావ్యం కాదన్నారు. ఇది రైతులను కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసమే అన్నారు. ఇప్పుడైనా బాబు నోరు విప్పాలన, జాతీయ విపత్తుగా గుర్తించాలని డిమాండ్ చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications