పులివెందులకు వస్తా, అడ్డంపడ్డావని చెప్తా, దండం పెడ్తా: బాబు, జగన్ కౌంటర్
హైదరాబాద్: ప్రాజెక్టుల విషయమై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైసిపి అధినేత జగన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇరువురు నేతలు వాగ్వాదానికి దిగారు.
చంద్రబాబు మాట్లాడుతూ... పట్టిసీమను తాము రికార్డు సమయంలో పూర్తి చేశామని చెప్పారు. కరవు ప్రాంతాలకు నీరు ఇచ్చే బాధ్యత తమదేనని చెప్పారు. గాలేరు నగరి, హంద్రీనీవా ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. 2019 మార్చిలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు.
మీకు అర్థమైందా
నేను చెప్పింది మీకు అర్థమైందా అని వైసిపి నేతలను ప్రశ్నించారు. అందుకే మళ్లీ మీకు పాఠాలు చెబుతున్నానని వైసిపిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. గోదావరి పైన పోలవరం వస్తుందని, ఆ విషయం మీకు తెలుసో తెలియదన్నారు. ప్రతిపక్షం విషయం అర్థం చేసుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దన్నారు.
ప్రతిపక్ష నేతకు ప్రాజెక్టుల గురించి తెలియదన్నారు. మనకు పైన కర్నాటక, తమిళనాడుతో పాటు కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. మీరంతా తెలుసుకోవాలని, నేర్చుకోవాలని, చెప్పేది వినాలన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి మేథావులు ఈ అసెంబ్లీలో పని చేశారన్నారు.
నాకు ఏ విషయమైనా తెలియకుంటే నేర్చుకుంటానని చెప్పారు. మీరు కూడా విషయం తెలియకుండే ఊరుకోవాలన్నారు. ఏదైనా అంశం తెలిస్తే చెప్పాలన్నారు. నాకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. పదేపదే ఒకే విషయాన్ని మాట్లాడటం సరికాదన్నారు.
మీరు జలయజ్ఞం అంటూ ధనయజ్ఞం చేసిన ప్రాజెక్టులనే మేం పూర్తి చేస్తున్నామన్నారు. సముద్రంలోకి వెళ్లే కృష్ణా నది నీళ్లను తీసుకు వస్తామని చెప్పారు. మీ నియోజకవర్గానికి (పులివెందుల) నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటామన్నారు.
ప్రతిపక్ష సభ్యులు ఉన్నచోట టిడిపి గెలవాలి కాబట్టి అక్కడ కూడా మేం నీళ్లు ఇస్తామని చెప్పారు. విషయం తెలియకుండా మాట్లాడి కన్ఫ్యూజ్ చేయవద్దన్నారు. విషయం పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలని ప్రతిపక్ష నేతకు సూచించారు. వైసిపి సభ్యులది వితండవాదం అన్నారు. వైసిపి నేతలు కోరితే వారికి నిపుణులతో క్లాసులు చెప్పిస్తానని తెలిపారు. జగన్ అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు.
జగన్ మాట్లాడుతూ... తెలియని వ్యక్తికి చెప్పవచ్చునని, తెలిసిన వ్యక్తితో వాదించవచ్చునని, కానీ సగం తెలిసిన వారికి (చంద్రబాబును ఉద్దేశించి) ఏం చెప్పలేమన్నారు. ఈ రోజు చంద్రబాబు నిత్యం పట్టిసీమ అని పదేపదే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
పోలవరం కుడి కాలువను వైయస్ 70 శాతం పూర్తి చేశారు కాబట్టే, చంద్రబాబు లిఫ్టుతో నీరు ఇస్తున్నారన్నారు. 180 టీఎంసీల కృష్ణా డెల్టాకు.. కేవలం 4 టీఎంసీల నీటిని పట్టిసీమ నుంచి ఇచ్చి కృష్ణా డెల్టాను కాపాడారా అని ఎద్దేవా చేశారు.
జగన్! నిజంగా నీకు క్లాస్ కావాలి
చంద్రబాబు మాట్లాడుతూ... నిజంగానే జగన్కు క్లాస్ కావాలన్నారు. ఇక లాభం లేదన్నారు. నేను మొదటిసారి సీఎం అయినప్పుడు జనార్ధన్ రెడ్డి ఉండేవారని, ఆయన జగన్లా మాట్లాడేవారన్నారు. దీంతో తాను జనార్ధన్కు చెప్పానని, నీకు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు.. వచ్చే ఎన్నికల్లో గెలవలేవని చెప్పానని అన్నారు.
రోడ్డు వైడింగును కూడా ఆయన అడ్డుకున్నారని, మిగతా ప్రజాప్రతినిధులు అడ్డుకుంటే, ఆయన మాత్రం అడ్డుకున్నారని, హైటెక్ సిటీ కడుతుంటే.. ఎయిర్ పోర్టు నుంచి హైటెక్ సిటీకి రోడ్డు వేస్తే సరిపోతుందా అని వైయస్ ప్రశ్నించారని, కానీ ఇప్పుడు తెలంగాణకు హైదరాబాద్ ఆదాయం అయిందన్నారు.
ఇప్పుడు జగన్ ప్రతి దానికి అడ్డుపడుతున్నారన్నారు. ప్రాజెక్టులకు వైసిపి ఎమ్మెల్యేలే అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంత మంచి ప్రాజెక్టు వస్తే ఎవరైనా మద్దతిస్తారని లేదంటే గమ్మున కూర్చుంటారని, కానీ జగన్ పార్టీ మాత్రం అడ్డంగా అడ్డుపడుతున్నారన్నారు.
పలమనేరు, పుంగనూరు, మదనపల్లి తదితర వైసిపి ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా వస్తాయన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు, జగన్ నీరు ఇస్తానంటే ఒప్పుకోలేదని, అయినా నేను ఇచ్చానని ప్రజలకు చెబుతానన్నారు. నేను అడ్డంగాపడి అయినా.. పులివెందులకు కూడా నీరు ఇస్తానని చెప్పారు.
జగన్ అడ్డుపడినా పులివెందులకు నీరు ఇచ్చానని, నీ నియోజకవర్గంలోనే చెబుతానన్నారు. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రజల కోసం ఆలోచించాలన్నారు. నేను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు ప్రజల అభిప్రాయం, ప్రజల కోసం పని చేయడం తెలియదా అన్నారు.
ప్రజలు ఇప్పటికే నీ చెవిలో ఓసారి పూవులు పెట్టారని ఎద్దేవా చేశారు. నీవు వ్యవసాయం చేయలేదని, వేరే వ్యాపారం చేశావని జగన్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. వ్యవసాయం చేస్తే నీకు తెలుస్తుందన్నారు. ఒకే వర్షం పంటను దెబ్బతీస్తుంది, ఒకే వర్షం పంటను నిలబెడుతుందన్నారు.
రెయిన్ గన్తో పంటలను నిలబెడతామంటే తుపాకీతో కాలుస్తారా అని జగన్ అన్నా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు. జగన్కు నేను దండం పెట్టి చెబుతున్నానని, అర్థం చేసుకోవాలన్నారు. పులివెందుల సహా అన్ని ప్రాంతాలకు నీరు ఇస్తామని చెప్పారు.
జగన్ పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాడంటే నేను ఆయన తీరును అర్థం చేసుకోలేకపోతున్నానని చెప్పారు. నేను చెప్పింది అర్థమైందా అని ప్రతిపక్ష సభ్యులను ప్రశ్నించారు. అసలు మీకు ఏం అర్థమైందని నవ్వుతూ చెప్పారు. మీకు తప్పకుండా పాఠాలు చెప్పించాల్సిందే అన్నారు. బలవంతంగా మిమ్మల్ని బడికి పంపిస్తామన్నారు.
చంద్రబాబు అవుట్ డేటెడ్
జగన్ మాట్లాడుతూ.. నేను అయిదు నిమిషాలు కూడా మాట్లాడకుండానే వారు ఎంతోసేపు మాట్లాడారన్నారు. నేను అవుట్ డేటెడ్ అని చంద్రబాబు చెప్పకనే చెప్పారని ఎద్దేవా చేశారు.