శారదా పీఠంలో జగన్..హఠాత్తుగా సీఎం రాజశ్యామల పూజలపై ఏపీలో ఆసక్తికర చర్చ
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి హఠాత్తుగా విశాఖ శారదా పీఠానికి వెళ్ళారు . లోక కల్యాణార్థం విశాఖ శారదాపీఠం చేపట్టిన విశ్వశాంతి యాగం పూర్ణాహుతికి హాజరయ్యారు. అక్కడ నేడు నిర్వహిస్తున్న విశ్వశాంతి యాగంలో పాల్గొన్న జగన్ , రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ క్రమంలో సీఎం జగన్ శారదా పీఠానికి అకస్మాత్తుగా వెళ్లి పూజలు చెయ్యటంపై ఏపీలో ఆసక్తికర చర్చ సాగుతుంది.

శారదాపీఠంలో విశ్వశాంతి మహాయాగం,రాజశ్యామలాదేవి పూజల్లో పాల్గొన్న జగన్
శారదాపీఠం వార్షికోత్సవాల సందర్భంగా విశ్వశాంతి మహాయాగం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . ఇక ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ శారదా పీఠానికి వెళ్ళిన సీఎంకు పూర్ణకుంభంతో వేదపండితులు ఘన స్వాగతం పలికారు. విశ్వశాంతి యాగంలో పాల్గొన్న జగన్ శారదాపీఠంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర వారి ఆశీస్సులు తీసుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

శారదాపీఠాధిపతులతో కలిసి గోపూజలు , జమ్మి ప్రదక్షిణలు
పీఠాధిపతులతో కలిసి జమ్మిచెట్టు ప్రదక్షిణ చేసిన సీఎం వైఎస్ జగన్.. గోమాతకు నైవేద్యం సమర్పించారు. పీఠంలో నూతనంగా నిర్మించిన స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. జగన్ వెంట మంత్రి అవంతి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. ఇక అంతే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన శ్రీనివాస చతుర్వేద హవనం పూర్ణాహుతిలోనూ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్తో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు.

కోర్టుకు కూడా హాజరుకాని జగన్ శారదా పీఠం వెళ్ళటంపై విమర్శలు
అయితే పరిపాలనా కార్యక్రమాల్లో ఊపిరి కూడా ఆడకుండా పని చేస్తున్న వై ఎస్ జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావటానికి అధికారిక కార్యక్రమాలే అడ్డంకి అని చెప్తున్నారు. కానీ విశాఖ శారదా పీఠానికి మాత్రం వీలు చేసుకుని మరీ వెళ్ళారని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. అధికారం సుస్థిరం చేసుకునేందుకు సీఎం జగన్ అక్కడ రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారని భావిస్తున్నారు.

కేసీఆర్ తరహాలో అధికారం సుస్థిరం చేసుకోటానికి రాజశ్యామలా దేవి పూజలు
ఎందుకంటె గత ఎన్నికల ముందు తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా రాజశ్యామలా దేవికి పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే . అప్పుడు సీఎం కేసీఆర్ కూడా అధికారం కోసమే విశాఖ వెళ్లి మరీ అమ్మవారికి పూజలు చేశారని ప్రచారం జరిగింది. తాజాగా రాష్ట్రంలో పరిస్థితులు గందరగోళంగా ఉండటం ,ఒకపక్క సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ వేగంగా సాగుతుండటం, త్వరలో తీర్పు వస్తుందని ప్రచారం సాగుతుండటం వంటి అనేక కారణాలు సీఎం జగన్ ను టెన్షన్ పెడుతున్నాయి.

స్వరూపానంద సూచనల మేరకే పూజలు
ఇక సీఎం జగన్ పాలన చేపట్టిన నాటి నుండి స్వరూపానంద సూచనల మేరకే పని చేస్తున్నారని చెప్తున్నారు. పరిపాలన విశాఖకు మార్చాలనే నిర్ణయం వెనుక ఉంది స్వరూపానంద సలహాలేనని అంటున్నారు. జనవరి ఇరవై మూడో తేదీ లోపు రాజధానిని తరలించకపోతే ఏలిన నాటి శని పట్టుకుంటుందని చెప్పారని అందుకే జగన్ ఇలా చేస్తున్నారని దేవినేని ఉమ లాంటి నేతలు బహిరంగ విమర్శలు చేశారు. అయితే 23వ తేదీలోపు తరలించలేకపోయారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన ఆయనకు ఉందని, అందుకే ఇప్పుడు ఆయన శాంతి పూజలు చేయాలనుకుంటున్నారని ఈ మేరకు స్వరూపానంద సలహా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే జగన్ హఠాత్తుగా శారదా పీఠానికి వెళ్ళారని అధికారం సుస్థిరం చేసుకోటానికి పూజలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.












Click it and Unblock the Notifications