రేపు ఆగమన్నా మావాళ్లు ఆగరు-సుప్రీంకెళ్తామని జగన్ హెచ్చరిక ! కార్యకర్తల పరామర్శ...!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైసీపీ కార్యకర్తలు, నాయకులపై జరుగుతున్న దాడుల పర్వం నేపథ్యంలో ఇవాళ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ నేతలు గింజుపల్లి శ్రీనివాసరావు, డేరంగుల గోపి, దేవిశెట్టి రామకృష్ణలను జగన్ పరామర్శించారు. జగ్గయ్యపేటలో టీడీపీ దాడిలో గాయపడి విజయవాడ సన్రైజ్ ఆసుపత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. వీరి పరామర్శ తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు.

జగ్గయ్యపేటలోని నవాబ్ పేటలో ప్లాన్ ప్రకారమే టీడీపీ నేతలు 20 మంది కలిసి తమ కార్యకర్తలపై దాడి చేశారని జగన్ ఆరోపించారు. ఇలాంటి ఘటనలతో చంద్రబాబు ఏం సాధిస్తారని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని జగన్ కోరారు. హైకోర్టుకు.. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని జగన్ ఎన్డీయే సర్కార్ ను హెచ్చరించారు.

కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కొంత సమయం పడుతుందని, కానీ చంద్రబాబు సర్కార్ విషయంలో ఆ వ్యతిరేకత చాలా వేగంగా వస్తోందని జగన్ తెలిపారు. సీఎంగా ఉన్న చంద్రబాబు పాలనపై దృష్టిపెట్టడం లేదని, మ్యానిఫెస్టో హామీల్ని అమలు చేయడం లేదని ఆరోపించారు.

నంద్యాలలోనూ తాజాగా ఓ రాజకీయ హత్య జరిగిందని, త్వరలో అక్కడ కూడా పర్యటిస్తానని జగన్ తెలిపారు. ఇవాళ మీరు అధికారంలో ఉండొచ్చు, రేపు తాము అధికారంలోకి వస్తామని జగన్ తెలిపారు. కానీ పరిస్ధితి ఇలాగే కొనసాగితే మాత్రం తమ ప్రభుత్వం వచ్చాక వైసీపీ కార్యకర్తల్ని తాము ఆగమన్నా ఆగే పరిస్దితి ఉండదని జగన్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications