‘ఆ కష్టం తెలుసు: వైయస్ హెలికాప్టర్ అదృశ్యమైనప్పుడు మేమూ ఇలాగే’
విశాఖపట్నం: ఇటీవల అదృశ్యమైన వాయుసేన విమానంలో ప్రయాణించిన భూపేంద్రసింగ్ ఆచూకీ ఇప్పటి వరకు తెలియకపోవడంతో ఆయన కుటుంబసభ్యులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. విశాఖలోని మర్రిపాలెంలోని 104 ప్రాంతంలోని భూపేంద్ర సింగ్ కుటుంబాన్ని కలిసి అధైర్యపడవద్దని సూచించారు.
ఈ సందర్భంగా భూపేంద్ర సింగ్ కుమారుడితో జగన్ మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమైనప్పుడు కూడా తాము చాలా ఆందోళనకు గురయ్యామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైయస్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వారితో చెప్పారు.
ఆరోజు ఎంతో కష్టం అనుభవించామని, ఆ కష్టం తమకు తెలుసుని అన్నారు. గల్లంతైన వాయుసేన విమానం ఆచూకీని గుర్తించేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరతామని వారికి భరోసా ఇచ్చారు.
కాగా, భూపేంద్ర సింగ్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి స్వస్థలం ఉత్తరప్రదేశ్. విమానం అదృశ్యమై నాలుగు రోజులు గడుస్తున్నా భూపేంద్ర సింగ్ జాడ తెలియకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు ఆయన కోసం తల్లడిల్లిపోతున్నారు.