కోడికత్తి కేసులో మరో కీలక పరిణామం-విజయవాడ నుంచి వైజాగ్ కోర్టుకు బదిలీ.. !
2019లో వైజాగ్ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కేసు వ్యవహారం ఇవాళ మరో మలుపు తిరిగింది. ఈ దాడిలో ఎలాంటి కుట్రా లేదని ఎన్ఐఏ తేల్చేసిన నేపథ్యంలో తిరిగి ఈ కేసును సమగ్రంగా విచారించాలని కోరుతూ వైఎస్ జగన్ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. అలాగే తాను ఈ కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాలేనని, కాబట్టి అడ్వకేట్ కమిషనర్ తో వాంగ్మూలం తీసుకోవాలని మరో పిటిషన్ వేశారు. వీటిపై విచారణ జరిపిన విజయవాడ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
వైజాగ్ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కేసును విచారిస్తున్న విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఇవాళ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను విజయవాడ ఎన్ఐఏ కోర్టు నుంచి విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసులో మరిన్ని సంచలనాలు తప్పేలా లేవు. వైజాగ్ కోర్టుకు విచారణను బదిలీ చేసిన విజయవాడ కోర్టు.. ఆగస్టు 8కి ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.

అయితే విజయవాడ కోర్టు ఆదేశాలపై ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో 80 శాతం వాదనలు పూర్తైన తరువాత మరో ప్రాంతానికి బదిలీ చేయడం దారుణమని కోడి కత్తి శ్రీను తరపు న్యాయవాది గగన సింధు తెలిపారు. నిందితుడు శ్రీను కేసును తేలిగ్గా వదిలేసేదే లేదన్నారు. ఎక్కడైనా తమ వాదనలు పూర్తిస్థాయిలో వినిపిస్తామన్నారు. కేసు కొలిక్కి రావాలంటే కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలన్నారు.
ఇప్పటికే ఈ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు పూర్తి కావడం, ఎలాంటి కుట్రా లేదని తేల్చేసిన నేపథ్యంలో విజయవాడ కోర్టు తీసుకునే నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలాంటి సమయంలో కేసును వైజాగ్ కి బదిలీ చేయడం సంచలనం రేపుతోంది. వైజాగ్ లో ఈ దాడి జరిగిన నేపథ్యంలో వైజాగ్ కోర్టులో విచారణకు ఆదేశాలు ఇచ్చిందా లేక మరేదైనా కారణం ఉందా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే విజయవాడ కోర్టుకు బాధితుడైన సీఎం జగన్ రాలేనని పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వైజాగ్ కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications