జగన్ పైకి మళ్లీ కాలు దువ్వుతున్న పాత ప్రత్యర్థి..! తేడా వస్తే..!
ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్న కడప జిల్లా పులివెందులలో మాత్రం వైఎస్ కుటుంబ హవానే కొనసాగుతుంటుంది. వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎంతమంది జట్టు కట్టినా, ఎన్ని వ్యూహాలు రచించినా దశాబ్దాలుగా అవి విఫలమవుతూనే ఉన్నాయి. దీంతో పులివెందుల వైఎస్ కుటుంబ కంచుకోటగా మారిపోయింది. అలాంటి పులివెందులలో త్వరలో ఓ ఉప ఎన్నిక జరగబోతోంది. ఇందులో పోటీకి జగన్ పాత ప్రత్యర్థి బీటెక్ రవి భారీ వ్యూహాలే సిద్దం చేస్తున్నారు.
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఆగస్టులో ఈ ఉపఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఈ ఉపఎన్నికలో పోటీకి బీటెక్ రవి సై అన్నారు. ఇందులో పోటీ చేయాలా వద్దా అనేది నిర్ణయించేందుకు ఇవాళ మంత్రి సవిత ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న బీటెక్ రవి పులివెందుల జడ్పీటీసీ అభ్యర్ధిని నిలబెడతామని ప్రకటించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసి జగన్ చేతిలో ఓడిపోయిన బీటెక్ రవి.. ఇప్పుడు జడ్పీటీసీ ఉపఎన్నికల్లో తన కుటుంబ సభ్యుల్ని నిలబెట్టేందుకు సిద్దమవుతున్నారు. ఆయన భార్య లేదా సోదరుడిని పులివెందుల జడ్పీటీసీగా పోటీ చేయించి గెలిపించుకోవాలని చూస్తున్నారు. ఈ మేరకు తాము పోటీకి సిద్దంగా ఉన్నట్లు మంత్రి సవితకు వెల్లడించారు. దీంతో ఆమె ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీనిపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు.

పులివెందుల జడ్పీటీసీగా ఉన్న వైసీపీ నేత తుమ్మల మహేశ్వర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇందులో వైసీపీ అభ్యర్ధిని ఖరారు చేయాల్సి ఉంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణిని గాని, ఆయన తమ్ముడిని గాని బరిలో నిలపాలని నియోజ వర్గ నేతలు, కార్యకర్తలు నిర్ణయించారన్నారని, ఇదే విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళతామని, సీఎం చంద్రబాబునాయుడు తీసుకునే నిర్ణయం మేరకు పోటీపై స్పష్టత వస్తుందని మంత్రి సవిత తెలిపారు. అయితే రేపే నామినేషన్లకు చివరి రోజు కాబట్టి ఇవాళ సాయంత్రం దీనిపై చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకుంటారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి ఓడితే మాత్రం రాజకీయంగా ఎదురుదెబ్బ అవుతుందని కాబట్టి పోటీపై చంద్రబాబు తీసుకోబోయే నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications