‘పోలవరం’ ను ఆపాలని రాజశేఖర్ రెడ్డి ఆత్మ, జగన్ విఫల యత్నాలు: మంత్రి దేవినేని
అమరావతి: పోలవరం ప్రాజెక్టును ఆపాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ, ఆయన తనయుడు జగన్ శతవిధాల ప్రయత్నిస్తున్నారంటూ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మే చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు.
అవుకు టన్నెల్ పూర్తయితే పులివెందులకు నీళ్లు వస్తాయని జగన్ భయపడుతుంటే, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకూడదని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తాపత్రయ పడుతున్నారని మంత్రి విమర్శించారు.
అంతేకాదు, విజయసాయిరెడ్డితో దళారీ పనులు చేయించి కేసుల నుంచి బయటపడాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారంటూ ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పలు అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ బెయిల్ కోసం నాడు యూపీఏ సర్కార్ తో కుమ్మక్కయ్యారని చెప్పారు.
ఇప్పుడేమో కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీతో లాలూచీ రాజకీయాలు నడుపుతున్నారంటూ మంత్రి మండిపడ్డారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డిలతో జగన్ ఎందుకు రాజీనామా చేయించట్లేదు? కేవలం వైసీపీ చెందిన లోక్సభ సభ్యులతోనే రాజీనామా డ్రామాలేంటి? అని ఉమా ప్రశ్నించారు.