ఇక్కడా జగన్ దే తప్పు..!!
ఉపరాష్ట్రపతి ఎన్నిక గడువు సమీపిస్తోన్న కొద్దీ దేశరాజధానిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎన్డీఏ- ఇండియా బ్లాక్ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు నల్లేరు మీద నడకే.
ఇప్పటికే రాధాకృష్ణన్, ఇండియా బ్లాక్ అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి తమ నామినేషన్లను దాఖలు చేశారు. వారిని గెలిపించుకోవడానికి తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏపీలో అధికార టీడీపీ, వైఎస్ఆర్సీపీ.. రెండూ కూడా సీపీ రాధాకృష్ణన్ కే మద్దతు తెలిపాయి.

ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సీపీ రాధాకృష్ణన్ తో సమావేశం అయ్యారు. మర్యాదపూరకంగా ఆయనను కలిశారు. పార్లమెంట్ బలబలాలను చూసుకుంటే- ఎన్డీఏ అభ్యర్థి విజయం ఇప్పటికే ఖాయమైందనీ జోస్యం చెప్పారు.
ఈ ఎన్నికలపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు. ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కు వైఎస్ జగన్ మద్దతు ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ మద్దతు ఇస్తున్నారని, వీరిలో ఏ ఒక్కరు కూడా తెలుగు వ్యక్తి బీ సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు తెలపట్లేదని ప్రశ్నించారు.
తెలుగు జాతి ఆత్మగౌరవం కోసమే పుట్టిన టీడీపీ.. ఇండియా కూటమి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి నిలబడితే ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని వైఎస్ షర్మిల నిలదీశారు. గతంలో పీవీ నరసింహరావు కోసం ఎన్టీఆర్ నంద్యాల సీట్ వదులుకున్నారని గుర్తు చేశారు. తెలుగు బిడ్డ ఉన్నత స్థాయిలో ఉండాలి అనుకున్నారని, ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు మాత్రం తెలుగు జాతి ముఖ్యం అనుకోవట్లేదని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు తెలుగు జాతి కంటే..మోడీ ఖ్యాతి ముఖ్యమని చురకలు అంటించారు. తెలుగు వారి ఆత్మగౌరవం కంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మగౌరవం ఆయనకు ముఖ్యం అయినట్టు ఉందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ వాది అయిన ఎన్డీఏ అభ్యర్థికి చంద్రబాబు మద్దతు ఇవ్వడం సరికాదని చెప్పారు.
మతతత్వ బీజేపీకి వైఎస్ఆర్సీపీ మద్దతు ఇవ్వడం దారుణమని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. మోదీకి జగన్ దత్తపుత్రుడనే విషయం ప్రపంచం అంతా తెలుసునని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి అభ్యర్థి రాజకీయాలకు అతీతమని, సుదర్శన్ రెడ్డి న్యాయ నిపుణుడని, న్యాయమూర్తిగా గిరిజనలు, పేదల సంక్షేమానికి ఎన్నో గర్వించదగ్గ తీర్పులు ఇచ్చిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు.
అటువంటి తెలుగు బిడ్డ సుదర్శన్ రెడ్డి.. జగన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయినా మద్దతు ప్రకటించలేదని మండిపడ్డారు. బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడం వల్లే జగన్.. ఎన్డీఏ అభ్యర్థికి , ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తికి మద్దతు ఇచ్చారని విమర్శించారు. దీనికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications