YS Sharmila: కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలకు ముహూర్తం ఫిక్స్.. షెడ్యూల్ ఇదే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ సమయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన వైయస్ షర్మిలకు ఆ బాధ్యతలను చేపట్టి ఏపీలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాల్సిన బృహత్తరమైన బాధ్యత ఉంది. ఏపీలో వైయస్ షర్మిల ఎంట్రీ తో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారతాయని చర్చ జరుగుతున్న వేళ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడానికి వైయస్ షర్మిల సిద్ధమయ్యారు.
ఈ మేరకు ఆమె పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వైఎస్ షర్మిల జనవరి 20వ తారీకు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులర్పిస్తారు. ఆరోజు రాత్రి ఇడుపులపాయలో బస చేసి, 21వ తేదీ ఉదయం కడప నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

ఉదయం 11 గంటలకు విజయవాడలో పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలను స్వీకరిస్తారు. వైయస్ షర్మిల ఏపీ పర్యటన ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. రేపు కడప జిల్లా ఇడుపులపాయకు వెళుతున్న క్రమంలోనే ఆమె భారీ ర్యాలీ నిర్వహిస్తారని, తన బలం ఏమిటో చూపించే ప్రయత్నం చేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ షర్మిల ఎంట్రీపై అందరిలో ఆసక్తి నెలకొంది.
అంతే కాదు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడుతున్న వైఎస్ షర్మిల రాజకీయంగా ఏమి మాట్లాడబోతున్నారు. ఆమె తన సోదరుడు జగన్ పాలనను టార్గెట్ చేసే అవకాశం ఉందా? ఇతర రాజకీయ పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ పట్ల ఆమె స్టాండ్ ఏమిటి? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ లో నూతనోత్సాహం వస్తుంది అన్నది వాస్తవం. అయినా ఆమె ఎంట్రీ తర్వాత పార్టీలో చోటు చేసుకోబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నది అందరిలో ఆసక్తిగా మారింది. మొత్తంగా షర్మిల ఏపీలో ఎంట్రీ రాజకీయ వర్గాలకే కాదు ప్రజలకూ ఇంట్రెస్టింగ్ అంశమే.












Click it and Unblock the Notifications