YS Sharmila: షర్మిలకు కాంగ్రెస్ బిగ్ టాస్క్, 2024లో ఆయనే గెలవాలి - ఆపరేషన్ ఏపీ..!!
ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. జగన్ లక్ష్యంగా టీడీపీ, జనసేనతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా షర్మిల ను ప్రయోగించాలని నిర్ణయించింది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే క్రమంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. తొలుత తెలంగాణలో మొదలై ఏపీ బిగ్ టాస్క్ గా నిర్ణయించింది. తొలుత తెలంగాణకే పరిమితం అని చెప్పిన షర్మిల.. ఇప్పుడు తాజా ప్రతిపాదనకు అంగీకరించారు.
కాంగ్రెస్ లో విలీన చర్చలు: కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో షర్మిల చేరిక..పార్టీ వీలనం వ్యవహారం అనేక మలుపులు తీసుకుంటోంది. షర్మిల వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీకి సిద్దమయ్యారు. షర్మిల పార్టీలో చేరటం పైన అభ్యంతరం లేదని.. తెలంగాణలో ప్రాధాన్యత ఇస్తే పార్టీకి నష్టమని టీపీసీసీ చీఫ్ రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేసారు. షర్మిల ఎంట్రీని కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు సమర్ధించారు.

షర్మిలను పార్టీలో చేర్చుకుని తెలంగాణ బాధ్యతలు ఇస్తే బీఆర్ఎస్ కు అనుకూల అస్త్రంగా మారుతోందనేది రేవంత్ వాదన. దీంతో, తెలంగాణ కాకుండా ఏపీ నాయకత్వం అప్పగిస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించింది. దీనికి షర్మిల నో చెప్పారు. కానీ, అనేక చర్చలు..చోటు చేసుకుంటున్న పరిణామాలతో తాజా చర్చల్లో కొత్త ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. దీంతో, రెండు రాష్ట్రాల్లోనూ షర్మిలకు ప్రాధాన్యత ఉండేలా కొత్త నిర్ణయం జరిగింది.
రాజ్యసభకు షర్మిల: వచ్చే ఎన్నికల్ల పాలేరు నుంచి షర్మిల పోటీ వద్దని, కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చింది. పాలేరు నుంచి గెలిచినా, ఓడినా ఏపీలో బాధ్యతల విషయంలో సమస్యలు వస్తాయని నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో షర్మిల సూచించిన వారికి తెలంగాణ అసెంబ్లీ సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
షర్మిల తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించానని, అందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. పలు విడతల చర్చల తరువాత రాజ్యసభ సీటు..కాంగ్రెస్ లో జాతీయ స్థాయి పదవి ఇచ్చేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. దీని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ షర్మిలకు ప్రాధాన్యత దక్కేలా చూస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

షర్మిలకు ఏపీ టాస్క్: ఏపీలో 2024 ఎన్నికల్లో లక్ష్యం ఏంటనేది కాంగ్రెస్ ఇప్పటికే డిసైడ్ అయింది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పూర్తిగా జగన్ వైపు వెళ్లిందని..2024 ఎన్నికల్లోగా తిరిగి ఆ ఓట్ బ్యాంక్ తమ వైపు తిప్పుకోవటం సాధ్యం కాదని కాంగ్రెస్ నాయకత్వం గుర్తించింది. ఫలితంగా 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు అవసరమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
దీని ద్వారా 2029 ఎన్నికల నాటికి ఏపీలో తిరిగి కాంగ్రెస్ పుంజుకొనే అవకాశం ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. ఇందు కోసం షర్మిలకు పార్టీలో జాతీయ స్థాయిలో పదవి ఇవ్వటంతో పాటుగా ఏపీలో నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలనేది పార్టీ వ్యూహం. అయితే, కాంగ్రెస్ వ్యూహాలకు పూర్తిగా షర్మిల సహకరిస్తారా..షర్మిల ఏపీలో కాంగ్రెస్ నేతగా ఎంట్రీ ఇస్తే నిజంగా జగన్ ఓట్ బ్యాంక్ ను టార్గెట్ చేసే స్థాయిలో ప్రభావితం చేయగలరా అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications