బెంగళూరుకు జగన్: కోర్టుకు విజయమ్మ, షర్మిల
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం బెంగళూరుకు వెళ్లనున్నారని సమాచారం. ఆయన బయలుదేరి వెళ్లేంత వరకు పర్యటన ఖరారు కానట్లేనని అంటున్నారు. గురువారం బెంగళూరుకు వెళ్తే తిరిగి ఆదివారం ఆయన హైదరాబాదుకు రానున్నారు.
వాస్తవానికి బుధవారం, గురువారం జగన్ కడప జిల్లాకు వెళ్లవలసి ఉంది. బెంగళూరుకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు బుధవారం అనుమతి ఇవ్వడంతో చివరి నిమిషంలో ఆయన కడప పర్యటనను వాయిదా వేసుకున్నారు.
భద్రతపై కోర్టుకు విజయమ్మ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్లు భద్రత పైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు భద్రతను విత్ డ్రా చేసుకున్నందుకు వారు హైకోర్టును ఆశ్రయించారు. తమ భద్రతను ఉపసంహరించుకోవడం సరికాదని వారు కోర్టుకు విన్నవించారు. తమకు 2004 నుండి ఉన్న భద్రతను తిరిగి పునరుద్దరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోరారు.