'జగన్ తీరుతో విసిగిన విజయమ్మ, షర్మిల: పార్టీలో ఉండరు'
విజయనగరం: ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసిపి అధినేత జగన్ తీరుతో ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కూడా విసిగిపోయారని వ్యాఖ్యానించారు. వైసిపిలో చివరకు మిగిలేది వైయస్ జగన్ ఒక్కరే అన్నారు. జగన్ వైఖరితో విసిగిపోయిన విజయమ్మ, షర్మిలలు కూడా ఆ పార్టీలో ఉండరని చెప్పారు.
కెసిఆర్, చంద్రబాబులపై జైరామ్ రమేష్ ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్ తెలంగాణ సీఎం కెసిఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుల పైన శుక్రవారం నాడు మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార టిడిపి, టిఆర్ఎస్ పార్టీలు విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవడం విడ్డూరమన్నారు.
జైరామ్ రమేష్ ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన రాజ్యసభలో మాట్లాడారు. ఏపీ, తెలంగాణలలో అసెంబ్లీ సీట్ల పెంపుకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించదని చెప్పారు. వెంకయ్య నాయుడు, బిజెపి అసెంబ్లీ సీట్ల పెంపుకు అనుకూలంగా ఉండటాన్ని ఆయన ప్రశ్నించారు.
జార్ఖండ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలలో అసెంబ్లీ సీట్ల పెంపు పైన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇవి పదిహేనేళ్ల క్రితం రాష్ట్రాలుగా ఏర్పడ్డాయని చెప్పారు.
చిన్న రాష్ట్రమైన కేరళలో 140 సీట్లు ఉంటే, జార్ఖండ్లో మాత్రం 80 సీట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. పది కోట్ల మంది ఉన్న పశ్చిమ బెంగాల్లో 294 సీట్లు ఉన్నాయని, అంతే జనాభా ఉన్న తెలుగు రాష్ట్రాలలోను అన్నే సీట్లు ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ సీట్ల పెంపుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించదని చెప్పారు.